Monday, April 29, 2024

కిషన్ రెడ్డి, నీ భార్యను ఆర్టీసి బస్సు ఎక్కించు

- Advertisement -
- Advertisement -

బిజెపి పార్టీ సంస్కారమే సక్కగా లేదు, మా ఇంఛార్జీల గురించి ఎందుకు !
బిజెపి నాయకులపై జగ్గారెడ్డి ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్:  కిషన్ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా? నీ కళ్లకు కనిపించడం లేదా? నీ భార్యను ఆర్టీసి బస్సు ఎక్కించు, అప్పుడైనా ఉచిత పథకం గురించి తెలుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యిందని, 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు బిజెపి హామీల గురించి ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. నీ పార్టీ సంసారమే సక్కగా లేదు, మా ఇంఛార్జీల గురించి ఎందుకు అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంచార్జీల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని, ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు.
కెసిఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్‌రెడ్డికి బిజెపి ప్రెసిడెంట్
‘రాష్ట్రంలో ఏమైతుందని తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడివి, నువ్వేం కేంద్ర మంత్రివి?’ అని జగ్గారెడ్డి కిషన్‌రెడ్డిని విమర్శించారు. కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌ను బండి సంజయ్ తిడుతున్నాడని, కెసిఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్‌రెడ్డి బిజెపి ప్రెసిడెంట్ అయ్యాడని, ఇది వారి పార్టీ నేతలు అంటున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారు ?
కాంగ్రెస్ అధికారంలోకి రావడం బిజెపికి ఇష్టం లేదన్నారు. బిజెపి విమర్శలను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దీపాదాస్ మున్షీ, మాణిక్కం ఠాగూర్, మానిక్ రావు ఠాక్రేలను విమర్శించే స్థాయి బిజెపి నాయకులకు లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బిజెపి నాయకుల మైండ్ బ్లాంక్ అయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిజెపికి నిద్రపట్టడం లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారన్నారని ఆ హామీ ఏమైందన్నారు. బండి సంజయ్‌ను ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌కు నష్టం రాకూడదనే బిజెపి పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించిందన్నారు. కెసిఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ బిజెపి అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారని, కిషన్ రెడ్డి ఆ పోస్ట్ దక్కించుకున్నారని ఆయన ఆరోపించారు.
బండి సంజయ్‌కు ఆయన కుర్చీ కాపాడుకునే శక్తి లేదు
బండి సంజయ్‌కు ఆయన కుర్చీ కాపాడుకునే శక్తి కూడా లేదన్నారు. నీ కుర్చీలో కూసుంటే నీకు తెలియకుండానే లాగేశారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. నీకు దానిమీదే సోయి లేదు, ప్రజలు కాంగ్రెస్‌కు పెట్టిన నోటి కాడి ముద్ద సంగతి ఏం సోయి ఉంది నీకు అని బండి సంజయ్ మీద జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఓడిపోయి మైండ్ దెబ్బతిందన్నారు. బెంజ్ కారు పెద్ద పనా నెలకు లక్ష కడితే బెంజ్ కారు వస్తదన్నారు. బెంజ్ కారు గిఫ్ట్ అనేది నవ్వులాట అని జగ్గారెడ్డి తెలిపారు. ఏం విమర్శలు చేయాలో కూడా బిజెపికి తెలియకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News