మూడు దఫాలుగా సర్వేకు రంగం సిద్ధం
..రూ 125 కోట్ల వ్యయం ..భారీ స్థాయి ఏర్పాట్లు
ఏక సభ్య కమిషన్ నుంచి నివేదికకు రంగం
వివరాలు వెల్లడించిన సిఎం సిద్ధరామయ్య
బెంగళూరు : కర్నాటకలో అత్యంత కీలకమైన ఎస్సి సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. షెడ్యూల్ కులాల సమగ్ర వివరాలను రూపొందించేందుకు, వారి ఆర్థిక , సామాజిక స్థితిగతులను కూలంకుషంగా అధ్యయనం చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికార వర్గాలు సోమవార తెలిపాయి. రాష్ట్రంలో షెడ్యూలు కులాల వాస్తవిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ గణన కీలకం అవుతుంది.సోమవారం ఆరంభమైన సర్వే గురించి రాష్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్సిల జన గణన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆరంభమైందని వివరించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి , జస్టిస్ హెచ్ఎన్ నాగమోహన్ దాస్ నాయకత్వంలోని ఏక సభ్య కమిషన్ను ఈ సర్వే గురించి సంప్రదించారు.
ఎస్సి జాబితాలో ఉప కులాల చేరిక ఇతర విషయాల గురించి ఇప్పటి సర్వే తరువాత సమగ్ర నివేదికను అందించే బాధ్యతను ఈ కమిషన్ నిర్వర్తిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.ఎస్సి లిస్టులోని 101 కులాల సంబంధిత వివరాల సేకరణ ఇప్పటి సర్వే ఉద్ధేశం అని సిఎం తెలిపారు. ఇప్పుడు తొలి దఫా అధ్యయనం జరుగుతుంది. తరువాతి రెండో దశ సర్వే వచ్చే నెల 19, 21 తేదీలలో ఎంచుకున్న క్యాంప్లలో చేపడుతారని తెలిపారు. ఇక ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి 60 రోజుల వ్యవధిలో అందించాల్సి ఉంటుంది. సర్వే సమగ్రత, విశ్వసనీయత, ఖచ్చితత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ 100 కోట్లు వెచ్చిస్తుంది. కాగా ఈ ప్రక్రియ నిర్వహణకు దాదాపుగా 65, 000 మంది ఉపాధ్యాయులను ఎన్యూమ్రేటర్స్గా తీసుకున్నారు. మూడో దశ అధ్యయనం మే 19 నుంచి మే 23 తేదీ వరకూ జరుగుతుంది .