నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో సోమవారం గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం వెలికితీశారు. స్థానిక అగ్నిమాపక రెస్ట్ టీం గజ ఈతగాళ్లు సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను ఒడ్డుకు తీసుకురావడంతో యువకుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో సోమార్పేట్ అటవీ ప్రాంతంలోని బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లిన సోమార్పేట్ గ్రామానికి చెందిన బెస్త హర్షవర్ధన్ (17), ఎల్లారెడ్డి మండలం, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన అయితే నవీన్ (23), నిజాంసాగర్ మండలం,
నర్సింగరావుపల్లి గ్రామానికి చెందిన కల్లేటి మధుకర్ గౌడ్ (16) గల్లంతైన విషయం విధితమే. సోమవారం రాత్రి 10 గంటల వరకు గజ ఈతగాళ్లు ఎంత వెతికినా ప్రయోజనం చేకూరలేదు. రాత్రి పరిస్థితులు అనుకూలంగా లేవని మంగళవారం ఉదయమే అగ్నిమాపక రెస్యూ టీం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు నీటి లోపల బురద గుంతలో మొదట మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత అయితే నవీన్ మృతదేహం లభ్యం కాగా, మధ్యాహ్నం బెస్తా హర్షవర్ధన్ మృతదేహం లభించింది. క్రికెట్ ఆడిన స్నేహితులంతా స్నానానికి వెళ్లి నీటి మునిగి గల్లంతయ్యారు. అగ్నిమాపక రెస్యూ టీం ఆరేడు గంటలు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు.
బ్యాక్ వాటర్ గుంతల వల్లే మునిగారు:
నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ఉన్న బురద గుంతలో చిక్కుకొని ముగ్గురు యువకులు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి వయసులో తారతమ్యం ఉన్నప్పటికీ కలిసి ఆడుతూ మంచి స్నేహంగా ఉండే వారిని గ్రామస్థులు తెలిపారు. మధుకర్ గౌడ్ 9వ తరగతి పూర్తయిందని, బెస్త హర్షవర్ధన్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి కాగా, నవీన్ మెకానిక్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. మృతులు ముగ్గురు వారి వారి తల్లిదండ్రులకు పెద్ద కుమారులు కావడం గమనార్హం. చేతి కందొచ్చిన కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.