Saturday, April 27, 2024

టీ తాగటానికి వెళ్లిన యువకులు..తిరిగిరాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

జోగిపేటః ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన అందోల్ మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జోగిపేటకు చెందిన యువకులు మహ్మద్ వాజీద్(28), హాజీ(29), ముక్రమ్(22), రిజ్వాన్, శంషు, అర్షద్‌లు టీ తాగటానికి జోగిపేట నుంచి కారులో బయలుదేరారు. సంగుపేట వద్ద గల బ్రిడ్జి పక్క నుంచి మాసాన్‌పల్లి వైపు సర్వీస్‌రోడ్‌లో వెళ్లారు. మాసాన్‌పల్లి గ్రామ శివారులోకి రాగానే మూత్ర విసర్జన కోసం కారు ఆపారు. నలుగురు కిందికి దిగారు. వాజీద్, హాజీ, ముక్రమ్‌లు కారు ముందు నిలబడి ఉన్నారు. కొంత దూరంలో మరొకరు మూత్ర విసర్జన చేస్తున్నాడు.

అపుడే సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న ట్యాంకర్ అతి వేగంగా కారుతో పాటు ఆ ముగ్గురిని ఢీకొట్టింది. ట్యాంకర్ అతివేగంగా ఉండటంతో వాజీద్ తలపై నుంచి వెళ్లిపోయింది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. రిజ్వాన్‌కు కాళ్లు విరిగాయి. వెంటనే అంబులెన్స్‌లో రిజ్వాన్‌ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య, జోగిపేట సీ.ఐ అనిల్‌కుమార్, ఎస్.ఐ అరుణ్‌కుమార్‌లు పరిశీలించారు.

మెకానిక్ వృత్తితో జీవనం..
వాజీద్, హాజీ, ముక్రమ్‌లు ముగ్గురు కూడా మెకానిక్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వాజీద్ బైక్ మెకానిక్, హాజీ ఏసీ మెకానిక్, కాగా ముక్రమ్ చికెన్‌సెంటర్‌లో పనిచేస్తాడు. వాజీద్‌కు గత ఏడాది మే 23న వివాహం జరిగింది. భార్య ప్రస్తుతం 8 నెలల గర్భవతి కావడంతో అమ్మగారింటికి వెళ్లింది.
ఆసుత్రికి భారీసంఖ్యలో
ప్రమాదం జరిగిన సంఘటన మంగళవారం ఉదయం పట్టణంలో దావాణంలా వ్యాపించింంది. దీనితో స్నేహితులు, బంధువులు, ఆసుపత్రికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆసుపత్రికి వచ్చి మృతుల బంధువులను పరమార్శించి ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News