Friday, March 29, 2024

చేతుల శుభ్రంతో వ్యాధులు దూరం

- Advertisement -
- Advertisement -

Today is Global Hand Wash Day

•నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో చేతులని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు.ఇప్పుడిది కోవిడ్ నిబంధనలలో ఒకటిగా మారింది. రోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల వ్యాధి కారక క్రిములు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. తినడానికి ముందు ,తర్వాత ,బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిదని చిన్నారులకు దీనిని అలవాటు చేయాలని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఏటా అక్టోబర్‌ 15న అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం గా పాటిస్తున్నారు.150 ఏళ్ల క్రితం చేతులు శుభ్రంగా కడుక్కోవడం పై పెద్దగా ఎవరికి అవగాహన లేదు.

చేతుల పరిశుబ్రత లేకపోవడం వల్ల ప్రతీ సంవత్సరం అతిసార, శ్వాస కోస సంబంధింత వ్యాధులతో పిల్లలు అధిక సంఖ్యలో మర ణిస్తున్న నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 15న వరల్డ్‌ హ్యాండ్‌ వాష్‌డేగా ప్రకటించింది.అరచేతులు శుభ్రంగానే ఉన్నట్లు కనిపించినా కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయనే విషయాన్ని ఊహించలేం. నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి పోవు. సబ్బుతో కానీ, హ్యాండ్‌ వాష్‌ ద్రావకంతో కాని దాదాపు 20 సెకన్లు కడుకుంటేనే శుభ్రంగా ఉన్నట్లు. ప్రతిరోజూ భోజనం చేయడానికి ముందు, మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత ఇలా చేతుల్ని శుభ్రపర్చు కోవడం మనల్ని ఎన్నో ఆరోగ్యాల బారి నుంచి రక్షిస్తోంది.

పరిశుభ్రతతో అనారోగ్యాలు దూరం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరిచేరవు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా పనులు చేస్తుంటాం. భోజనం చేసినా, ముక్కు చీదినా, పాలు పితికినా, ఇంకా పలు పనులు చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన మలినాలు,దుమ్ము, ధూళి చేతులకు అంటుకుంటాయి. ఆ చేతులను సబ్బు -నీటితో శుభ్రం చేసుకోకుండా తాగడమో, తినడమో చేస్తాం. మల విసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకోం. దాంతో సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.

చేతులు కేవలం నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోదు. సబ్బుతో శుభ్రం చేసుకున్నప్పుడే క్రిములు శరీరంలోకి చేరవు.అలాగే గోళ్లని ఎప్పటికప్పుడు కత్తిరించుకొవాలి.

సబ్బు అందుబాటులో లేనిచో కనీసం నీటితో బాగా కడగాలి. కుళాయి ఉంటే ఫోర్స్‌గా తిప్పి చేతులు కడగాలి. కాళ్లు కడగడం తప్పనిసరి. ఆహారం తీసుకున్న తర్వాత చేతులు కడిగాక ఉతికిన పరిశుభ్రమైన కర్చీఫ్‌తోనూ, టవల్‌తోనూ చేతులను తుడుచుకోవాలి. టవల్‌ను, బట్టలను పొడిగా ఉంచాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి.దువ్వెనలో మట్టి లేకుండా చూసుకోవాలి. చేతుల పరిశ్రుభతపై ప్రజలకు పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.

వ్యాధులను కలిగించే అనేక రకాల సూక్ష్మజీవులు మట్టి, గాలిలోనే ఉంటాయి. ఇవి టైపాయిడ్‌, విరేచనాలు, రక్తహీనత తదితర వ్యాధులకు కారణాలవుతాయి. ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి. కేవలం ఆహారం తీసుకునే ముందు, మామూలు సబ్బుతో ఏడంచెల పద్దతిలో చేతులు వాష్‌ చేసుకుంటే పలు జబ్బులు అరికట్టవచ్చు.ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా బయట ఆటలు ఆడి ఇంటికి వస్తారు.వారు దాహంతో చేతులు,కాళ్ళు కడుక్కోకుండా నే మంచి నీళ్ళు తాగుతుంటారు.ఫలితంగా వారు అనేక వ్యాధుల బారినపడతారు.వర్షా కాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తాయి. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి.చేతులు, కాళ్లు శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఒక అలవాటుగా మారాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News