Monday, April 29, 2024

జైలుకు జగజ్యోతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతికి ఎసిబి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మార్చి 6 వరకూ ఆమెకు రిమాండ్ విధిస్తూ చంచల్ గూడ మహిళా జైలుకు తరలించాలని ఆదేశాలిచ్చింది. మరోవైపు, జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని, రిమాండ్ ఆపాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టు ను కోరారు. కోర్టు అనుమతి తీసుకున్నామని ఎసిబి న్యాయమూర్తి తెలపగా జగజ్యోతికి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరిం చింది. ఈ నెల 19న జగజ్యోతిని ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ క్రమంలో ఆమె ఇంట్లోనూ సోదా లు నిర్వహించారు. అదే రోజు రాత్రి ఆమె తనకు అస్వస్థతగా ఉందని ఎసిబి అధికారులకు తెలిపారు. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ధారిస్తూ బుధవారం డిశ్చార్జి చేశారు. అనంతరం ఆమెను అధికా రులు ఎసిబి కోర్టులో హాజరు పరిచారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జగజ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.65.50 లక్షల నగదు, 3.6 కిలోల బంగారు నగలు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.

జగజ్యోతి బినామీలపై ఎసిబి నజర్..కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే ఛాన్స్…
ప్రస్తుతం ఎసిబి అధికారు లు జగజ్యోతి ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో ఆమె ఇంట్లో డబ్బు, నగలతో పాటు భారీగా డాక్యుమెం ట్లు దొరికాయి. ఇప్పుడా డాక్యుమెంట్ల విలువను అంచనా వేస్తున్నారు. అందుకోసం ఆయా రిజిస్ట్రర్ ఆఫీసులను సంప్రదిస్తున్నారు. అక్కడే లభించే సమాాచారంతోనే ఆమె ఆస్థుల మొత్తం విలువ తెలుస్తుంది. జగజ్యోతికి ఎవరైనా బినామీలు కూడా ఉన్నారా అన్న కోణంలోనూ ఎసిబి విచారణ జరుపుతోంది. ఆమె ఆస్తుల పూర్తి వివరాలు తెలిసినా తరువాత ఎసిబి అధికారులు ఆమె కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. హెచ్‌ఎం డిఎ మాజీ అధ్యక్షుడు శివ బాలకృష్ణ కేసులోనూ ఎసిబి అధికారులు ఇదే వ్యూహాన్ని అవలంబించారు. జగజ్యోతి కేసులో ఏం జరిగిందంటే నిజా మాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనులకు బిల్లులు

మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగిం చేందుకు కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించారు. పథకం ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్ రూ.84 వేలు లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగజ్యోతికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటూ ఓ అధి కారి చిక్కిన కేసులో ఇంత పెద్దమొత్తంలో ఆస్తులు పట్టుబడడం కలకలం రేపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News