భోపాల్: మధ్యప్రదేశ్లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆ ఇద్దరితో పాటు రెండు సంవత్సరాల పాప ఊపిరాడక విగతజీవిగా మారింది.. దీంతో పోలీసులు మహిళ భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెండు మృతదేహాలు కాళ్లు చేతుల కట్టేసి కాలిపోయి ఉన్నాయి. మంజు అనే మహిళ మృతదేహం బెడ్ పై ఉండగా రెండేళ్ల పాప మృతదేహం మరో బెడ్ మీద ఉంది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గ్యాస్ స్టౌవ్పై ఉంది. గోడల మీద నిందితుడు రాసిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘నా తమ్ముడి ఆత్మహత్యకు మంజునే కారణమని అందుకే ఆమెను చంపేశానని, ఆమె కుటుంబంలో అందరిని చంపేస్తానని గోడలపై రాశాడు’. తరువాత మంజు తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్ చేసి కూతురిని, అల్లుడిని తగలబట్టానని… దమ్ముంటే కాపాడుకోవాలని బెదిరించాడు. వెంటనే ఆ ఫోన్కు మంజు తల్లిదండ్రుల ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంజుకు పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని స్థానికులు తెలిపారు. ట్రిపుల్ మర్డర్ కేసులో ప్రస్తుతం మంజు భర్త రవిపై అనుమానం రావడంతో అతడిని ఝార్ఖండ్ లోని రూర్కెలాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంజు కాల్ రికార్డులు, సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల వెనక ఎవరెవరు ఉన్నారని పోలీసులు కూపీ లాగుతున్నారు