ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన
హైదరాబాద్ : టిఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రం నుంచి రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకుగాను మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్ వేర్వేరుగా నామినేషన్లను దాఖలు చేశారు. వీటి పరిశీలన సోమవారం జరగ్గా నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఈ ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్రెడ్డి మాత్రమే బరిలో నిలిచారు. అయితే బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కావడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వెలువడనుంది.