Saturday, May 4, 2024

టెట్ దరఖాస్తులు 2,86,386

- Advertisement -
- Advertisement -

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు ముగిసింది. టెట్‌కు మొత్తం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. పేపర్ 1కు 99,958 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,86,428 వచ్చాయి. పేపర్ 2కు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 9,162 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ములుగు జిల్లాలో 1,888 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పేపర్ 1కు వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 5,879 మంది దరఖాస్తు చేసుకోగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యల్పంగా 771 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు. 2016లో టెట్‌కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 దరఖాస్తులు వచ్చాయి. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్ష జరుగనుంది.

ఉదయం 9 నుంచి 11.30 వరకు పేపర్ 1, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మే 15వ తేదీన హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఫలితాలను జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షను విద్యాశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు అర్హత సాధించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్‌సిలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా బి.ఇడి, డి.ఇడి పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్ పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు. ఈ సారి పది రోజుల దరఖాస్తు గడువు పెంచగా అదనంగా 80 వేల మంది అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News