Saturday, April 27, 2024

టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో నగరంలోని అశోక్ నగర్‌లో ప్రత్యేకంగా సమావేశమవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. అశోక్ న గర్‌తో పాటు పలు యూనివర్సిటీలలో ఉద్యోగాల కు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు మంత్రి కెటిఆర్‌ను కలిసి, ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చ ర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యలపైన కూలంకషంగా చర్చించేందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి అంటే డిసెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకి అశోక్ నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగార్డులతో సమావేశం అవుతానని కెటిఆర్ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థుల సూచన మేర కు గ్రూప్-2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుకూలంగా పూర్తిగా ప్రక్షాళన కూడా చేసే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియపై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదని, సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదని కెటిఆర్ అన్నారు. తాము రాష్ట్ర యువకులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు.
రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ విమర్శలు
గత పది సంవత్సరాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రం కన్న ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తమపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా పది సంవత్సరాలలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, యువకులకు గణాంకాలతో సహా వివరించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం నియామకాలపై చేస్తున్న అసత్య పూరిత ప్రాపగాండాను రాష్ట్ర యువకులు, విద్యార్థులు తిప్పికొట్టి నిజాలు తెలుసు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అభ్యర్థులకు అందించారు. మంత్రి కెటిఆర్ తమతో ఈ అంశం పైన విస్తృతంగా సంభాషించడం తమకు సంతోషాన్ని కలిగించిందని మంత్రితో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగార్థులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చిన ప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వల్ల యువతలో కొంత ఆందోళన నెలకొందని వారు పేర్కొన్నారు. ఈ అంశాల పైన మంత్రి కెటిఆర్‌తో తమ అభిప్రాయాలను, సూచనలను పంచుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని ఈ సందర్భంగా వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్యార్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం ఈ సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలను పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
దశాబ్ద కాలం పాటు ఒక ఉద్యోగిగా పని చేసిన అనుభవం ఉన్నది
ఒక యువకుడిగా దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రైవేట్ రంగంలో ఒక ఉద్యోగిగా పని చేసిన అనుభవం తనకు ఉన్నదని కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైన దాన్ని సాధించేందుకు, తర్వాత దాని నిర్వర్తించేందుకు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను కచ్చితంగా తాను అర్థం చేసుకోగలుగుతానని మంత్రి అన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు, యువ కులకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తెల్లారే యువకులతో హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యో గాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు అందరితో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, వారి సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపైన యువకుల ఆకాంక్షలకు అనుగుణమైన ఒక విధానపరమైన నిర్ణ యాన్ని తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి కెటిఆర్‌తో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సంభాషణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News