Friday, April 26, 2024

రాష్ట్ర సాధనలో ఆర్టీసిది కీలక పాత్ర: ఎండి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసిది కీలక పాత్ర అని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసి ఉద్యోగులు కీలక భూమిక పోషించారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసి ఉద్యోగులు పోరాడారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసి ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు.

ఆర్టీసి ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెను కొనసాగించారని, 56,604 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషిచేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసి ఉద్యోగులు సమ్మెలో పాల్గొని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె విజయవంతం అయ్యిందన్నారు. అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చూపారని ఆయన కొనియాడారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యోగులు చైతన్యపరిచారని ఆయన గుర్తు చేశారు.

కొందరు ఉద్యోగులు తమ పాటలు, రచనలు, నాటకాల ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉద్యోగులు నిలవడం సంస్థకు గర్వకారణమని ఆయన ప్రశంసించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టిఎస్ ఆర్టీసి కుటుంబం తరపున అమరులకు ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 9 ఏళ్లలో టిఎస్ ఆర్టీసిలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని సజ్జనార్ తెలిపారు. ప్రజల ప్రోత్సాహం, అదరాభిమానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూ టిఎస్ ఆర్టీసి ముందుకు దూసుకుపోతోందని, భవిష్యత్‌లోనూ మరెన్నో కార్యక్రమాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ప్రజల సహకారం, ఉద్యోగుల కృషితో టిఎస్ ఆర్టీసికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News