Saturday, April 27, 2024

వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి

- Advertisement -
- Advertisement -

కంభంపాటి రామమోహన్ రావు వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి నిలుస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయక కర్త కంభంపాటి రామమోహన్ రావు అన్నారు. రాబోయే ఏ ఎన్నికలలో నైనా పోటీకి మేము సైతం అనే రీతిలో పనిచేస్తామని తమ పార్టీ ముక్తకంఠంతో ఏక గ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఈ మేరకు శనివారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కంభంపాటి రామమోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనులు తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో టిటిడిపి
పార్టీని పునర్ నిర్మించి బలోపేతం చేయాలంటే ఏమి చేయాలో పార్టీ ముఖ్యనాయకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు శనివారం సమావేశమయ్యామన్నారు. తెలంగాణ గడ్డపై టిడిపిని ఖచ్చితంగా రెపరెపలాడించడం కోసం పార్టీనేతలంతా మూకుమ్మడిగా పనిచేయాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. “ మా పార్టీ జెండా, ఎజెండా ప్రజలే. ప్రజల కోసమే మేము పుట్టాం.. ప్రజల కోసమే మేము కొనసాగుతున్నాం. రాబోయే రోజులలో కూడా ప్రజల కోసమే మా పనితనం ఉంటుంది” అని కంభంపాటి రామమోహన్ రావు అన్నారు.

తెలంగాణ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ…తెలుగుదేశం పార్టీ అనుక్షణం ప్రజాపక్షంగానే ఉంటుందని, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజాహితంగా పనిచేసే వారికి మా మద్దతు ఉంటుందన్నారు. ఒక వేళ ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు ఎవరు చేసినా ఖచ్చింతంగా టిడిపి ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటుందని కంభంపాటి హెచ్చరించారు.

అనంతరం టిడిపి జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదని, టిడిపి జాతీయ నాయకత్వం తటస్థంగా ఉండాలని రాష్ట్రపార్టీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికలు జరినప్పుడు గతంలో కూడా పార్టీలు ఇలాగే పోటీ చేయని దాఖలాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తూ.. మాకున్న పరిస్థితులలో మేము ఎన్నికలలో పాల్గొనలేదని, ఎన్నికలలో పాల్గొననప్పడికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది హైదరాబాద్ నగరంలోనేనని 1982లోనే స్వర్గీయ నందమూరి తారాక రామారావు తెలుగుదేశంపార్టీని ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి దాకా కూడా వారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు , అదే విధంగా నారా లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజునాయక్ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యంగా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూర్చొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకునేందుకు సమావేశమయ్యామన్నారు. అందులో భాగంగానే మేము ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు గాని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కనబడుతున్నాయని రాజు నాయక్ పేర్కొన్నారు. వీటిని ప్రజలకు మరోకసారి వివరించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అది దోహదపడుతుందని భావిస్తూ.. ఆ విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అన్నింటినీ క్రోడీకరించుకొని నూతన ఉత్తేజంతో భవిష్యత్తుకు బాటలు వేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నిఖార్సయిన నాయకులందరం అతికష్ట కాలంలో కూడా కన్నీరు మున్నీరై మా పార్టీ పోటీ చేయలేకపోయేనని బాధలో ఉన్నప్పటికీ భవిష్యత్ టిడిపికి ఉంటుందన్న ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని రాబోయే తరాలకు టిడిపి ఆదర్శంగా ఉంటుందన్న సందేశాన్ని చంద్రబాబు చెప్పారని కంభంపాటి రామమోహన్ రావు తమకు చెప్పడంతో ఈ రోజు నాయకులు చాలా సంతోషాన్ని వ్యక్త పర్చారన్నారు. ఏదేమైనా సరే.. పార్టీ నిర్ణయాత్మక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఉంటుందనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గా ప్రసాద్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News