Friday, April 26, 2024

జ్వర సర్వే భేష్

- Advertisement -
- Advertisement -

Union Health Minister Mansuk Mandaviya praised the fever survey

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసల జల్లు

అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటాం
కరోనా కట్టడికి తెలంగాణ అద్భుతమైన వ్యూహం
కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ
రాష్ట్రంలో మూడో వేవ్ సన్నద్ధతను వివరించిన మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ రాష ప్రభుత్వం మంచి వ్యూహం అనుసరిస్తుందని అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు విధాన రూపకల్పన చేస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎపి, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరుపున వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఖమ్మం కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు వివరించారు.

రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని మంత్రి హరీశ్ రావు వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో మరోసారి జ్వర సర్వే ప్రారంభించుకున్నట్లు తెలిపారు. మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వేలో పాలు పంచుకుంటున్నాయని అన్నారు. ఈ సర్వేలో ఆరోగ్య, పంచాయితీ లేదా మున్సిపల్ విభాగాల నుండి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోమ్ ఐసొలేషన్ కిట్స్ ఇస్తున్నామని, తదుపరి వారం పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారని చెప్పారు. అవసరం అయితే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 77,33,427 ఇళ్లల్లో జ్వర సర్వే చేయడం నిర్వహించి, 3,45,951 కిట్లను అందించినట్లు వివరించారు. జ్వర సర్వేతో ప్రభుత్వ వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటి రేటు తగ్గి, హాస్పిటలైజేషన్ తగ్గిందని చెప్పారు. లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వం ఇస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్లు వినియోగించడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నట్లు చెప్పారు. మరో వైపు కొవిడ్ ఓపి సేవలను సబ్ సెంటర్, పీహెచ్‌సి, బస్తీ దవాఖానల నుండి జిల్లా, టీచింగ్ ఆసుపత్రుల వరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 27 వేలకు పైగా ఉన్న అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలి…

కోమార్బిడిటీస్ వారితోపాటు, 60 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు మరోసారి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల గడువును తగ్గించాలని, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని కోరారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

పెండింగ్ నిధులు విడుదల చేయాలి

ఈసిఅర్పీ-2 కింద రాష్ట్రానికి రావాల్సిన రెండో దశ పెండింగ్ నిధులు రూ.248 కోట్లు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రిని కోరారు. పిడియాట్రిక్ ఐసియులకు ఎస్‌ఎన్‌సియూ తరహాలో అవసరమైన మానవ వనరులను సమకూర్చాలని, కేంద్రం సరఫరా చేసిన వెంటిలేటర్స్‌ని వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన హ్యుమిడిఫయర్లను కూడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News