Thursday, April 25, 2024

ఊరూరా రైతుల సంబరాలు

- Advertisement -
- Advertisement -
  • ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ఊరేగింపులు
  • బీడు భూములను సాగు చేసిన ఘనత కేసీఆర్‌దే

సూర్యాపేట : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు శనివారం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రైతుల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రమైన సూర్యాపేట మండలం యండ్లపల్లిలోని రైతు వేధికలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొనగా, తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల మండలం నేలమర్రి క్లస్టర్‌లో, హుజూర్‌నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి లింగగిరి క్లస్టర్‌లో పాల్గొని తెలంగాణ ఏర్పాటు ముందు అన్నదాతలు ఎదుర్కొన్న సమస్యలను ఏకరూ పెట్టి ఇటీవల కాలంలో సాధించిన అభివృద్దిని వివరించారు. మంత్రి జగదీష్ రెడ్డి యండ్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఎద్దుల బండి పై రుమాలు చుట్టి చండ్రకోలం చేతపట్టి యండ్లపల్లి గ్రామ నడిబొడ్డు నుండి రైతు వేధిక వరకు ర్యాలీగా ముందకు సాగారు.

ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేళుళ్లు, కోలా నృత్యాల నడుమ అన్నదాతల ఆనందోత్సహాల మధ్య కోలాహలంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నాడు సాగునీటి నుండి త్రాగు నీటి వరకు ఇబ్బందులు పడిన ప్రజలకు శుద్ధి జలాలను అందించడమే కాకుండా 24గంటల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు.

రైతుల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోని అవకాశవాదులు ఎన్నికల ముందు మాట్లాడుతున్న మాటలు ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. రైతు ఏడ్చిన దేశం ఎప్పుడు బాగుపడదన్న పెద్దల సామెతను దృష్టిలో పెట్టుకుని ఎన్ని అడ్డంకులు ఎదురైన ఆర్థిక భారాలు తట్టుకుని రైతులకు బాసగా నిలిచి బీడు భూములను సాగు భూములుగా మార్చడమే కాకుండా పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసిన చరిత్ర దేశంలోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

60 ఏళ్లలో సాకారం కాని ఎన్నో భృహత్ కార్యక్రమాలను పదేళ్ల కాలంలో సాధించుకున్నామని, వాటి కొనసాగింపు భవిష్యత్తులో ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తానికి జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఆనందోత్సవాల మధ్య సాగుతున్న తీరుతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు వేధికల వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులకు రైతులు ముఖ్యంగా మహిళ రైతులు ఎదురు వెళ్లి మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. పలు చోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ప్రత్యేక ఆకర్షణగా అలంకరించి ఊరేగింపుగా రావడం ఆయా గ్రామాలలు ప్రాంతాలలో పండుగ వాతావరణంను తలపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News