Saturday, April 20, 2024

రాష్ట్రంలోని ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా మెరవాలి: మంత్రి వేముల ఆదేశం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా మెరవాలి
పీరియాడికల్ రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలి
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు 45 రోజుల్లో పనులు పూర్తి కావాలి
ఆర్ అండ్ బి అధికారులకు మంత్రి వేముల ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా మెరవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పీరియాడికల్ రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు 45 రోజుల్లో రోడ్డు రెన్యువల్ పనులు పూర్తి కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ 5వ అంతస్థులోని ఆర్ అండ్ బి శాఖ కాన్ఫరెన్స్ హాల్లో ఆ శాఖపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మొదటి సమీక్షను నిర్వహించారు. ఆర్ అండ్ బి సెక్రటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ రవీందర్ రావు, డి.సి దివాకర్, ఎస్.ఈ వసంత్ నాయక్ ఇతర ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం రూ.2,858 కోట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని వారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి కావాలని మంత్రి సూచించారు.

ఇప్పటికే రూ.518 కోట్లతో 1393 కి.మీల పొడవులో రోడ్ల మరమ్మతులను పూర్తి చేశామని, రూ.1,223 కోట్ల విలువగల 455 రోడ్డు వర్క్‌ను ( మొత్తం 2,700 కి. మీలను) వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల పనుల కోసం 60 వర్క్ ఏజెన్సీలు పని చేస్తున్నాయని, ప్రతి ఏజెన్సీతో క్షేత్ర స్థాయిలో సమీక్షించి నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం 45 రోజుల్లో అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రతివారం తానే స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్‌ను పరిశీలిస్తానని మంత్రి అధికారులతో పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News