Saturday, April 20, 2024

వెనిజులా విప్లవ వేగుచుక్క

- Advertisement -
- Advertisement -

లాటిన్ అమెరికాలో ‘వెనిజులా’ దేశం విశిష్ట ప్రాధ్యాన్యాన్ని కలిగి ఉంది. లాటిన్ అమెరికాలో సైమన్ బొలివర్, ఫెడల్ కాస్ట్రో, చేగువేరాల తర్వాత విప్లవోద్యమ స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు హ్యూగో చావెజ్. ఆయన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అడుగడుగున ప్రతిఘటించి విప్లవ చోదకశక్తిగా ప్రభవించి ప్రత్యామ్నాయ సారథిగా పరిణమించి నయావలసవాద రాజకీయాలను అంతమొందించి ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గదర్శనం చేశారు. ప్రపంచంలో సంభవించిన విప్లవోద్యమ పరిణామాల్లో సైనిక తిరుగుబాటుతో వెలుగులోకి ప్రసరించిన హ్యూగో చావెజ్ నేతృత్వంలో కొనసాగిన ‘వెనిజులా విప్లవ ప్రయోగం’ విప్లవాలకు ‘దశ- దిశ’ను నిర్దేశించింది. ఆయన అందించిన స్ఫూర్తితో నేడు ఆయా లాటిన్ అమెరికా దేశాలు సామ్యవాద సంక్షేమ రాజ్యాలుగా నిత్యనూతనంగా వెలుగొందుతున్నాయి.

వెనిజులా రాజకీయ చరిత్రను పరీశీలిస్తే 1908లో యువాన్ విసెంటె గోమెజ్ అధికారంలోకి రావడంతోనే వెనిజులా ఆర్థిక ద్వారాలను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం బహిర్గతం చేశారు. 1935లో గోమెజ్ పూర్వపు అనుచరుడైన జనరల్ ఎలియాజర్ లోపేజ్ కాంట్రెరాస్ పాలనలో ప్రజాస్వామిక శక్తులు అజ్ఞాతంలోకి నెట్టివేయబడి రహస్య స్థావరాల నుండే తమ తమ కార్యకలాపాలను కొనసాగించాయి. ప్రజాస్వామిక కార్యాచరణ (ఎడి) పార్టీ, ప్రజాస్వామిక రాజకీయ ఎన్నికల సంఘటనా మండలి (కోపి)పార్టీల హవా వెనిజులాలో నిర్విఘ్నంగా కొనసాగుతుండేది. 1946లో వెనిజులా కమ్యూనిస్ట్ పార్టీ, 1947లో వెనిజులా కార్మిక సంఘాల సమాఖ్యలు ఏర్పడ్డాయి. వామపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రజాస్వామిక కార్యాచరణ (ఎడి)పార్టీ 1948లో పతనం చెందింది. 1948 నుండి దాదాపు పదేళ్ళపాటు పెరెజ్ జిమినెజ్ అనే సైనికాధికారి దేశంలో ముఖ్యంగా వామపక్ష ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేశారు.1960 వరకు కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రంగానే వ్యవహరించిననూ 1970లో చీలిపోయింది. ప్రభుత్వం వెనిజులాలో వామపక్షాలపై దుర్మార్గంగా దమనకాండలకు పాల్పడుతుండడంతో అవి కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి.

1971 తర్వాత వెనిజులాలో సైనిక అకాడమీని సంస్కరించారు. సామాన్య మధ్యతరగతి ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన హ్యూగో చావెజ్ సైనిక అకాడెమీలో చేరి 1975లో పట్టభద్రులయ్యారు. చావెజ్ గెరిల్లా నిరోధక కార్యకలాపాల నిమిత్తం నియమింపబడి చురుకైన పాత్రను నిర్వహించారు. అంతేకాకుండా ఆయన అధ్యాపకులుగా విధులు నిర్వర్తించి సైనిక విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపి కొత్త తరం సైనికులను, అధికారులను తీర్చిదిద్దారు.సైనిక అకాడెమీలో శిక్షణ పొందుతున్న రోజుల్లోనే వెనిజులా దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయాలని చావెజ్ నిర్ణయించుకున్నారు. పేదవర్గాల నుంచి వచ్చిన సైనికాధికారుల ప్రజాస్వామిక ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా 1987 డిసెంబర్ 17న ‘బోలివర్ విప్లవోద్యమం- 200’ని ఆవిర్భవింపజేయడంలో చావెజ్ విశేష కృషి చేశారు.

1989, ఫిబ్రవరి 27న ప్రభుత్వం ధరలు పెంచడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. 1989, మార్చి 4 నాటికి 400 మంది మృత్యువాత పడిన ఈ ‘కరాకాజో దమనకాండ’కి చలించిన హ్యూగో చావెజ్ బృంద సభ్యులు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణకు పిడికిలి బిగించారు. సైన్యంలో కేవలం పది శాతం మద్దతు కలిగి ఉన్న చావెజ్ వారి సహాయంతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 1992 డిసెంబర్‌లో సైనిక తిరుగుబాటు చేయాలనుకున్నారు.కాని తిరుగుబాటు వ్యూహకర్తలలో కొందరు ద్రోహులుగామారి తప్పులుచేయడంతో చావెజ్ పథకం విఫలం అయింది. అయిననూ ఆయన ప్రజల్లో పెద్ద కదలిక తీసుకువచ్చారు. ప్రజలు చావెజ్‌ని ‘దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే యోధుడి’గా చూశారు. సైనిక తిరుగుబాటులో పాల్గొన్న అనేక మంది అధికారులు, సైనికులు చెరసాలపాలు అయ్యారు.చెరసాలలో ఉండగానే చావెజ్ తీక్షణమైన అధ్యయనం చేసి ‘విప్లవాన్ని సమర్ధిస్తూ ముందుకు వచ్చిన వారంతా ఆకలితో ఉన్నవారేనని, విప్లవక్రమం సాధించకుండా వెనిజులా ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి బయటపడదు’ అని చావెజ్ గ్రహించి విప్లవక్రమం లక్ష్యాలను సాధించడానికి సైన్యాన్ని ఒక వాహకంగా ఎంచుకున్నారు.

చావెజ్ నిర్బంధం నుండి విడులయ్యాక సైన్యం వెలుపల కూడా ఉద్యమాన్ని బలోపేతం చేశాడు. ప్రజాస్వామిక కార్యాచరణ (ఎడి)పార్టీ, ప్రజాస్వామిక రాజకీయ ఎన్నికల సంఘటనా మండలి (కోపి) పార్టీలు విశ్వసనీయతను కోల్పోవుతున్న నేపథ్యంలో ‘ఎన్నికల పంథా’ను ఎంచుకోవడం మేలు అని ఉద్యమ నాయకత్వం భావించింది. చావెజ్‌తో పాటు ఇతర విప్లవ ఉద్యమనాయకులు దేశమంతా పర్యటించి ఆయా సముదాయాలతో చర్చలు జరిపి ‘రిపబ్లిక్ ఉద్యమాన్ని’ స్థాపించి దానికి రాజకీయ వేదికను కల్పించారు. 1997, ఏప్రిల్ 19న జరిగిన బొలివేరియన్-200 మహాసభల సందర్భంగా పార్లమెంట్ రాజకీయాల్లో పాల్గొనాలన్న నిర్ణయాన్ని చావెజ్ బృంద సభ్యులు తీసుకున్నారు. తదుపరి 1998 డిసెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ 56% ఓట్లు తెచ్చుకొని విజయం సాధించి అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో వెనిజులాలో విప్లవక్రమం మొదలైనది. సైన్యాన్ని వాహకంగా చేసుకొని అధ్యక్షుడుగా విజయం సాధించిన చావెజ్ పేదలకు గృహ వసతి కల్పించడం, వైద్యం, పౌష్టికాహారం తదితర సేవలను అందించడం లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు సైన్యాన్ని సమీకరింపజేశారు. 1999 జులై 29 న రాజ్యాంగ సభ ఏర్పాటు కావడం, 350 అధికరణలతో రాజ్యాంగ సభ నూతన రాజ్యాంగాన్నిఆమోదించడం జరిగింది.

వెనిజులా రిపబ్లిక్ గా ఉన్న దేశం పేరును ‘బొలివియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా’గా ఆధునీకరించారు. విద్య, వైద్యం, ఉపాధి, గృహావసతి, ఆహార వసతిలను ప్రజలందరికీ మౌలిక హక్కులుగా రాజ్యాంగంలో పొందు పరిచారు. 2006 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో చావెజ్ 63% ఓట్లు తెచ్చుకొని తిరిగి మూడోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే వామపక్ష శక్తులన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి ‘యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా’ ని చావెజ్ స్థాపించారు. అలాగే మరోసారి 2012 లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రలు, మీడియా విష ప్రచారాలు అన్నింటిని చావెజ్ అవలీలగా అధిగమించి 53% ఓట్లు సాధించి తిరిగి నాల్గవసారి అధ్యక్షుడుగాఎన్నిక కాబడి విజయఢంకా మోగించారు. చావెజ్ నాలుగు పర్యాయాలు అధ్యక్షుడుగా కొనసాగిననూ ఆయన తననెప్పుడు అధ్యక్షుడుగా భావించుకోలేదు.

ఆయన అతి నిరాడంబర జీవితాన్ని గడిపారు. చావెజ్ వెనిజులా స్థితిగతులను సునిశితంగా అధ్యయనం చేసి సరైన విప్లవ క్రమాన్ని అనుసరించడంలో కృతకృత్యులై విజయాన్ని సాధించారు. వెనిజులా విప్లవ పోరాటంలో చావెజ్ క్రియాశీల పాత్రని నిర్వహించారు. ప్రపంచీకరణ విధానాలకు ప్రత్యామ్నాయ బాటను చూపి ఆచరించి తన పద్నాలుగు ఏళ్ల పాలనను జనరంజకంగా తీర్చిదిద్దిన ‘బొలివేరియన్ సోషలిస్ట్’ గా చావెజ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వెనిజులాలో అమెరికన్ వలసవాద ఆధిపత్యాన్ని అంతమొందించి పేదప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రత్యామ్నాయ నేతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న హ్యూగో చావెజ్‌ని కాన్సర్ వ్యాధి కబళించడంతో 2013, మార్చి 5న తుదిశ్వాస విడిచారు. నేడు చావెజ్‌లేని వెనిజులా, చావెజ్ లేని లాటిన్ అమెరికా, చావెజ్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం ఎంత మాత్రం సాధ్యం కాదు.

జె.జె.సి.పి. బాబూరావు
94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News