Friday, April 19, 2024

కర్ణాటక, మహారాష్ట్ర ప్రముఖులతో వినోద్‌కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలోనే బిఆర్‌ఎస్‌పార్టీ కార్యాచరణను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తారని, రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించి ఆ దిశగా ముందడుగు వేద్దామని వినోద్‌కుమార్ మహారాష్ట్ర, కర్ణాటక ప్రముఖులతో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వివిధ వర్గాల ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. గురువారం మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమై వారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీని కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా విస్తరించేందుకు సంబంధించిన అంశాలపై వినోద్ కుమార్‌తో వారు చర్చించారు.

కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్, హుబ్లీ నగరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, యాదవ, కుర్మ వర్గానికి చెందిన సిద్ధన్న తేజీ, బెంగళూరు నగరానికి చెందిన సహకార సెక్టార్ ఉద్యమ నాయకులు నవీన్, మహిళల సమస్యలపై ఉద్యమించే నాయకురాలు బెంగళూరుకు చెందిన ఉషారాణి, చిక్బల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్మిక నాయకులు ప్రకాష్, మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా పూసద్ ప్రాంతానికి చెందిన గిరిజన సంఘాల నాయకురాలు సింపుల్ రాథోడ్, అకోలా ప్రాంతానికి చెందిన అంబు నాయక్‌లు బిఆర్‌ఎస్ పార్టీని తమ రాష్ట్రాల్లో అపూర్వంగా స్వాగతం పలుకుతామని వినోద్‌కుమార్‌తో వారు తెలిపారు.
కర్ణాటకలో కూడా గొర్రెల పంపిణీ
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఉందని, ప్రజల జీవన స్థితి దారుణంగా ఉందని ఆయా రాష్ట్రాల ప్రముఖులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రజలు కూడా కోరుకుంటున్నారని దార్వాడ్, హుబ్లీ నగరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సిద్దన్న తేజి అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం తమకు కావాలని కోరుకుంటున్న విషయాన్ని సిద్దన్న తేజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో తెలిపారు. ఇలాంటి పథకం కావాలని కర్ణాటక యాదవ, కుర్మ వర్గాల డిమాండ్ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మయ్ కూడా ఇటీవల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకటించారని సిద్దన్న తేజీ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ లంచ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News