Saturday, April 27, 2024

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలి

- Advertisement -
- Advertisement -

నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం
18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల తీర్మానం
దీనికి కట్టుబడి ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సూచన

మనతెలంగాణ/హైదరాబాద్:  సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం 18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తీర్మానించారు. ఈ సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్‌కు మద్దతిచ్చే పార్టీలకు మాత్రమే సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వేయాలని దీనికి ఉద్యోగులందరూ కట్టుబడి ఉండాలని వారు పేర్కొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ అగ్రసేన్ భవన్‌లో నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో దేశంలోని 18 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కార్యనిర్వాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సిపిఎస్ యూనియన్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ కోశాధికారి నరేష్ గౌడ్ హాజరయ్యారు.

ఇటీవల సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ ప్రకటించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు దేశంలోని 84 లక్షల ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ రాజస్థాన్ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల పట్ల చూపిన సామాజిక భద్రత గురించి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆలోచించాల్సిన విషయం ఆవశ్యకత ఉందన్నారు. ఇటీవల చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసిందని, అందులో భాగంగా ఇప్పటివరకు ఛత్తీస్‌ఘడ్ నుంచి జమ అయిన కాంట్రిబ్యూషన్స్ వెనుకకు చెల్లించాలని కోరుతూ (20/05/2022) PFRDA చైర్మన్‌కు లేఖ రాసిందని ఆయన తెలిపారు.

ఆ లేఖలో మొత్తం ఛత్తీస్‌ఘఢ్ సిపిఎస్ కాంట్రిబ్యూషన్స్ (ప్రభుత్వ+ఉద్యోగి) అమౌంట్ రూ.11,850 కోట్లు కాగా ప్రస్తుత మార్కెట్ వాల్యూ 17,240 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఆ కాంట్రిబ్యూషన్స్ మొత్తం అమౌంట్ నుంచి ఉద్యోగి వాటాను పిఎఫ్ అకౌంట్ కు మళ్లీస్తామని ఆ ప్రభుత్వం పేర్కొనడం సంతోషించదగ్గ విషయమని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. అంతే కాకుండా భవిష్యత్ పెన్షన్ చెల్లింపుల నిమిత్తం ఆ కాంట్రిబ్యూషన్స్ నుంచి ప్రభుత్వ వాటాతో స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ అకౌంట్ పరిధిలో ప్రత్యేక పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామినిచ్చిందన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు విజయ్‌కుమార్ బంధు, రాజస్థాన్ కోజారాం, జగదీష్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ అష్రాఫ్, హిమాచల్ ప్రదేశ్ ప్రదీప్ ఠాగూర్, ఉత్తరప్రదేశ్ త్రిపాఠి, రైల్వే నుంచి అమ్రిత్ సింగ్, ఉత్తరాఖండ్ జీత్ మని, ఒడిశా బీజాయ్ తదితర రాష్ట్రాల సిపిఎస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News