Monday, April 29, 2024

అభివృద్దిని చూపి ఓట్లడుగుతాం

- Advertisement -
- Advertisement -

పనికిమాలిన వాళ్ల మాటలకు ఆగం కావొద్దు
రెచ్చగొట్టే వాళ్లను లెక్క చేయొద్దు గత
ప్రభుత్వాలు గుడిని,బడిని పట్టించుకోలేదు
పలకతో వచ్చి పట్టాలు తీసుకొని వెళ్లే
విధంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం
బిజెపి నేతలకు చేతనైతే సిరిసిల్లకు
పవర్‌లూమ్ కస్టర్లను తేవాలి కంప్యూటర్
విద్య కోసం 26వేల స్కూళ్లు ఫ్రైబర్ గ్రిడ్
బ్రాడ్‌బాండ్‌తో అనుసంధానం త్వరలో
టీచర్లకు శిక్షణా తరగతులు 15 రోజుల్లో
మల్కంపేట రిజర్వాయర్ ప్రారంభం
సిరిసిల్లలో జరిగిన విద్యా దినోత్సవంలో
ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల: పైసా ఇవ్వను, మందు పోయను మీ దయ వుంటే మళ్లీ గెలుస్తానని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి  కెటిఆర్ అన్నా రు. మంగళవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ఎల్లారెడ్డిపేటలో రూ. 8 కోట్ల 50 లక్షల సిఎస్‌అర్ నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవన సముదాయాన్ని రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి ప్రారంభించారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కెటిఆర్ మాట్లాడారు.

గుణాత్మకమైన విద్యా ప్రమాణాలతో సి రిసిల్లలో అగ్రికల్చర్, పాలిటెక్నిక్ , మెడికల్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు నెల కొ ల్పినట్లు తెలిపారు. తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు, దళితబంధు , రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎవరి వల్ల సాధ్యమైయిందని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ కళాశాల, ఆస్పత్రుల ఏర్పాటు పరిశ్రమల స్థాపన కరీంనగర్ బిజెపి ఎంపి చేయ గలిగిండా అని పశ్నించారు. గత ప్రభుత్వాలు గుడిని బడిని పట్టించుకోలేదని విమర్శించారు. పలకతో వచ్చి పట్టాలు తీసుకొని వెళ్లే విధంగా పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. ఎవడో వచ్చి నాలు గు స్పీచ్‌లు కొట్టగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం ఆగం కావ్వొద్దని సూచచించారు. ఈ రాష్ట్రం ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు బాగుపడిందో ఒక్కసారిగా ఆలోచించాలని కెటిఆర్ కోరారు. 57 ఏండ్లలో గుడి, బడిని పటించుకోలేదు, తాగు, సాగునీటి గోసను పట్టించుకోలేదు.. కా నీ ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తామంటున్నారని ప్రతిపక్షాలపై కెటిఆర్ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. ప్రజల ను అయోమయం చేయటానికి రెచ్చగొట్టే మాటలు మా ట్లాడితే రెచ్చిపోనని వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతానన్నారు.

మనం ఖర్చు చేసే ప్రతి పైసాను సమగ్రంగా ఆలోచించాలని కెటిఆర్ అన్నారు. అప్పుడే ఇళ్లైనా, రాష్ట్రమైనా, దేశమైనా బాగుపతుందని ఆయన తెలిపారు. నాటి ప్రభుత్వాల హయాంలో ఒక్క నవోదయా పాఠశాలలైనా వచ్చిందా.. ఒక్క కస్తూర్బా కళాశాల వచ్చిందా… మెడికల్ కాలేజీ రాదు, నర్సింగ్ కళాశాల ఇవ్వరు మళ్లీ డిగ్రీ కళాశాల ఇవ్వాలని మాట్లాడుతున్నారని కెటిఆర్ ఫైర్ అయ్యారు. ఎవరి ప్రమేయం లేకుండ ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బరాబర్ ఎల్లారెడ్డిపేటకు వస్తది అని కెటిఆర్ తేల్చి చెప్పారు. కానీ ఎవరో ఆందోళన చేస్తే రాదని ఆయన అన్నారు. ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతో సిఎం కెసిఆర్ కళాశాల ఇస్తారన్నారు. కార్లకు అడ్డుపడటం, ధర్నాలు చేయటం కాదు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తేవడంతోపాటు రెండు కాలేజీలు, రెండు పరిశ్రమలు తేవాలన్నారు. అలాగే సిరిసిల్ల కోసం ఒక మెగాపవర్‌లూమ్ క్లస్టర్ తేవాలని ఆయన బిజెపి నేతలకు సవాల్ విసిరారు. మన ఊరు, మనబడి ద్వార పిల్లల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తున్నామని కెటిఆర్ అన్నారు. తరగతి గది నాలుగు గోడలు మూల స్తంభాలుగా పేర్కొన్నారు. అన్నింటికి మూలం చదువు ఒక్కటే మార్గం కనుక సిఎం నూతన విద్యా సంస్కరణలపై దృష్టి పెట్టారని అన్నారు. మరికొద్ది రోజుల్లో క్వాలిటీ విద్యా సంస్థలకు సిరిసిల్ల నెలవుకానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యా ప్రమాణాలు పెంచటానికి డిఇఒ ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని సూచించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారని వెల్లడించారు. మారుమూల ప్రభుత్వ పాఠశాలలలో చదివిన తెలంగాణ విద్యార్థులు అమెరికా ఐటి రంగ సంస్థల్లో చేరి ఉపాధి పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన విద్యార్థుల కోసం సిఎం కెసిఅర్ ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కంప్యూటర్ విద్య కోసం 26 వేల పాఠశాలలను ఫైబర్ గ్రిడ్ బ్రాడ్ బాండ్‌తో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు. త్వరలో టీచర్లకు కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కెటిఆర్ తెలిపారు. డిజిటల్ బోధన విద్యార్థుల్లో గుణాత్మకమైన మార్పుకోసం మన ఊరు, మనబడి పథకంలో పాఠశాలలకు 12 రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 28న తన జన్మదినం సందర్భంగా జిల్లాలో 6వేల మంది విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసినట్లు గుర్త్తు చేశారు. బడ్జెట్‌లో రూ. 7287 కోట్లు కేటాయించి గ్రీన్ బోర్డులు, కంప్యూటర్లు, తరగతి గదులు, టాయిలెట్స్, ల్యాబులు, గ్రంథాలయాలు, ప్రహరీ గోడలు, క్రీడా మైదానాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మొదటి దశలో 9023 స్కూళ్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు మానవ సంబంధాలు, జీవకారుణ్యంపై అవగహన కల్పించాలన్నారు. ఆడ పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అఖిల్ మహజన్‌ను ఆదేశించారు. దేశంలో బెస్ట్ స్కూళ్లకు సిరిసిల్ల అడ్డా కావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో ఎన్‌రోల్‌మెంట్ పెరిగినట్లు తెలిపారు. 9ఏండ్ల క్రితం విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగం ఏవిధంగా ఉన్నాయో అంచనా వేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జడ్‌పి చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి , కామారెడ్డి జడ్‌పి చైర్‌పర్సన్ శోభ రాజు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి,అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ,డిఇఓ రమేశ్, మాన కొండూర్ శాసన సభ్యులు రసమయి బాల కిషన్‌లు పాల్గొన్నారు.

సిరిసిల్లలో 1220 మంది దివ్యాంగులకు పరికరాలు అందజేత
మనసున్న మంచి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సిరిసిల్లలో1220 మంది దివ్యాంగులకు పరికరాలు, ఉపకరణాల పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల వంటి వారికి ఇచ్చే పెన్షన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉచితాలని వాటిని ఇవ్వకూడదని అంటూ ఉచిత సలహాలిస్తున్నారని కానీ అదే ప్రధాన మంత్రి మోడీ బ్యాంకులను మోసగించే కార్పొరేట్లకు మాత్రం పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నారు.

అంగన్వాడీ టీచర్ల జీతాలను కేంద్రం తగ్గించినా మన రాష్ట్రంలో మాత్రం వారికి పూర్తి జీతం చెల్లిస్తున్నామన్నారు. మనసున్న మన ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలకు అండగా ఉండాలని వారి సమస్యలు పరిష్కరించాలని మంచి మనస్సుతో మన రాష్ట్రంలో పేదలకు పెన్షన్లు పెంచారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత పెద్ద మొత్తంలో పెన్షన్లు తెలంగాణలో అందిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. మన పొరుగు రాష్ట్రాలైన ఛత్తీగఢ్‌లో 200 రూపాయలు, కర్నాటకలో 1100 రూపాయలు, కేరళలో 1300 రూపాయలు, మధ్యప్రదేశ్, మహరాష్ట్రలలో 300 రూపాయలు, మిజోరంలో 100 రూపాయలు, త్రిపురలో 700 రూపాయలు,గుజరాత్‌లో 700 రూపాయలు మాత్రమే పెన్షన్లుగా ఇస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్,దివ్యాంగుల కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ కె వాసుదేవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్‌పి సిపి అరుణ, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, దివ్యాంగుల కమీషనర్ శైలజ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ సర్కారు బడి సరికొత్త ఒరవడి అనే సిడిని ఆవిష్కరించారు. వాలీబాల్ అకాడమీని ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News