Friday, April 19, 2024

మంత్రగత్తె అనుమానంతో నిప్పులపైన నడిపించారు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: తాను మంత్రగత్తెను కాదని నిరూపించుకోవడానికి ఒక మహిళ బలవంతంగా నిప్పుల పైన, మేకుల పైన నడవాల్సి వచ్చింది. ఆమె చేత ఈ పని చేయించిన ఆమె భర్త బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ పట్టణంలో ఈ నెల 20న ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కాళ్లకు గాయాలు కావడంతో ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణంలోని కైలాష్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు మహిళలను, ఒక పురుషుడిని అరెస్టు చేసిన పోలీసులు తాంత్రికుడని చెబుతున్న ఒక మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

తాను క్షుద్రవిద్యలు నేర్చుకుని వాటిని ప్రయోగిస్తానన్న అనుమానంతో తన భర్త తమ్ముడు, అతని భార్య, అతని అక్క తనను ఒక మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారని బాధితురాలు మమతా నిషాద్ తెలిపింది. తన భర్త ఊర్లో లేని సమయంలో వారు ముగ్గురూ తనను కైలాష్ నగర్‌లోని ఒక మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారని, తాను చేతబడి చేయడం లేదని నిరూపించుకొమ్మని వారు చెప్పారని ఆమె తెలిపింది. ఆ మాంత్రికుడు తనను మండుతున్న బొగ్గుల పైన 12 సార్లు, మేకులపైన 9 సార్లు నడిపించాడని ఆమె వివరించింది. తన భర్త ఇంటికి తిరిగిరాగానే ఈ విషయం చెప్పానని, ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆమె చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News