జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇంత చేసిన జగన్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు అంటే ఎలా? అని ప్రశ్నించారు. దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకొంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆమె గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని, ఇది నిజమో కాదో వైవీ సుబ్బారెడ్డి అతని కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్లో నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేసీఆర్, జగన్ ఆనాడు నీచ రాజకీయాలు చేశారని, అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.
తాను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నిఘా పెట్టారని, తాను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారన్నారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన కుట్రనే అని, సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నానన్నారు. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్ అబద్ధాలు చెప్పించారని, రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరుగుతోందని, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని, తన ఫోన్ మాత్రమే అని భావించానని, వందల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పుడే తెలుస్తుందని, అందరికీ న్యాయం జరగాలని షర్మిల అన్నారు.