జిల్లా పోలీసులు, 81 అండ్ 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ద్ధి, సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ కల్పిస్తున్న సదుపాయాలను గురించి తెలుసుకొని నక్సలిజాన్ని విడనాడి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని, నిర్ణయించుకొని వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది నిషేదిత మావోయిస్టు పార్టీ సభ్యులు గురువారం జిల్లా ఎస్పీ రోహిత్రాజు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వీరితో కలిపి మొత్తం 294 మంది దళ సభ్యులు వివిధ హోదాల్లో డీవీసీఎంలు3, ఏసీఎంలు 17, పీఎంఎస్ 34, మిలీషియం మెంబర్లు 107, పీఆర్సీ మెంబర్లు 35, డీఏకేఎంఎస్, కేఏఎంఎస్ 47, సీఎన్ఎం మెంబర్లు 30, జీఆర్డీ మెంబర్లు 21 మంది జనజీవన స్రవంతిలో కలిసి తగిన పునరావాస సౌకర్యాలను పొందారు.
ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సాయుధ దళాల సంచారం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రా ల సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు దళాలకు సహకరించకూడదని, మావోయిస్టుల సమాచారం తెలిసినట్లైతే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్లలో కానీ లేదా జిల్లా ఉన్నతాధికారులకు కానీ తెలియజేయాలని, ఇలా ప్రజలు అందించిన సమాచారం ద్వారానే ఇటీవల ములుగు జిల్లాలో 20 మంది సాయుధ దళ సభ్యులను అరెస్టు చేయడం జరిగిందని, 12 ఆయుధాలను కూడా జప్తు చేశారన్నారు. లొంగిపోయిన వారిలో మడకం రమ అలియాస్ మడా అలియాస్ రఘు, మడకం భీమ అలియాస్ శ్రీకాంత్, పున్నం కవిత, ఓయం లక్క అలియాస్ దినేష్, తాటి భీమ, పొడియం దేవి అలియాస్ చిలుక, ముచాకి మాసా అలియాస్ సుధీర్, సోడి హుంగి, కోడి దేవ, మడకం కోసా, మడవి పాండు, సోడి ఊర ఉన్నారు.