హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్(ఆర్ఇఐఎల్) సంస్థ నేరుగా తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్(టిఎస్ఆర్ఇడిసిఓ)తో ఒప్పందం చేసుకున్నది. భారత ప్రభుత్వంలోని భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖకు చెందిన ఫేమ్ స్కీం(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు) కింద తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, మౌళిక సదుపాయాలను కల్పించేందుకు ఈ రెండు సంస్థలు గత రెండు రోజుల క్రితం అంగీకారానికి వచ్చాయి.
భారత ప్రభుత్వం ఈపాటికే మొదటిదశలో 200 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం టిఎస్ఆర్డిఇసిఓను రాష్ట్ర నోడల్ ఎజెన్సీగా నియమించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సబ్సిడీ ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం అత్యధికంగా మద్దతునిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాలకన్నా ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు తక్కువగా ఉంటాయి. ఇవి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా పెట్రోల్, డీజిల్ దిగుమతిని చేసుకోవడంలో కూడా గణనీయమైన విదేశీయ మారకాన్ని ఆదా చేస్తుందనేది ఉద్దేశ్యంగా ఉన్నది.
138 కేంద్రాలు
రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 138 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, మౌలిక వసతుల కల్పన కేంద్రాలను రెండవ ఫేమ్ స్కీంలో భాగంగా నెలకొల్పాలని టిఎస్ఆర్ఇడిసి సంస్థ నిర్ణయించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఆర్ఇఐఎల్ సంస్థ రాంచీ, బెంగళూరు, గోవా, సిమ్లా, హైదరాబాద్, ఆగ్రా జాతీయ రహదారుల్లో 270 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, ఎలక్ట్రిక్ వాహానాల తిరిగేందుకు అనుగుణంగా చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్రంలోని టిఎస్ఆర్ఇడిసి సంస్థ ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని ఆర్ఇఐఎల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జైన్ వెల్లడించారు. కేంద్రం 2022 నాటికి ఫేమ్ 2 ద్వారా రూ. 10,000 కోట్లు వెచ్చించాలని, అందులో రూ. 1000 కోట్లు ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, సదుపాయాల కల్పనకు వెచ్చించాలని లక్షంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల సంస్థ ద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం కోసం రాజస్థాన్కు చెందిన సంస్థతో అంగీకార ఒప్పందం చేసుకున్నట్టు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారుల వెంటనే కాకుండా నగర శివారు ప్రాంతంలోనూ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం సూచనలు చేసినట్టు అధికారులు వివరిస్తున్నారు. 138 కేంద్రాల లక్షం చేరుకునేందుకు ప్రదేశాలను పరిశీలించడం, ఆర్ఇఐఎల్తో కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.