రాజన్న సిరిసిల్ల : ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పరిధిలోని బండపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … బండపల్లి గ్రామానికి చెందిన మంజల దేవయ్య(30)కు ముగ్గురు ఆడపిల్లలు. గత కొద్ది రోజుల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న కంపెనీలో పని లేక, జీతాలు ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చిన దేవయ్య, ఇక్కడే కూలీ పని చేసుకుంటూ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ భారం మోయలేక, చేసిన అప్పులు తీర్చలేక, ముగ్గురు ఆడపిల్లల్ని పోషించలేక, మనస్తాపం చెందిన దేవయ్య గత కొద్ది రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు.
వారం రోజుల క్రితం చిన్న కూతురు పావనికి జ్వరం వచ్చింది. పావనికి వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోవడంతో దేవయ్య ఆవేదనకు గురయ్యాడు. భార్య చిలుకవ్వ తన పుట్టింటికి కూతుళ్లను తీసుకెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దేవయ్య శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం కోసం దేవయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు. దేవయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.