కేసముద్రం : పెళ్లి వాహనం బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలైన సంఘటన కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన వారు ఇనుగుర్తి గ్రామంలో జరిగే పెళ్లికి హాజరు కావడానికి బయలుదేరారు. కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామ శివారు మూలస్తంభం వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ఈ ఘటనలో 19 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సింగని శ్రీను పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో తురుక నిఖిత, స్మైలీ, మేడబోయిన లక్ష్మి, లింగాల ఆశ, పోతరబోయిన వెంకటమ్మ, చెక్కల శోభ, మేడబోయిన శోభ, గొడుగు లక్ష్మి, పోతరబోయిన పూలమ్మ, గొడుగు మల్లయ్య, గొడుగు ఉప్పమ్మ, జొన్నలగడ్డ అనూష, జొన్నలగడ్డ లలిత, వెంకటమ్మ, వల్లాల శ్రావణి, లింగాల పద్మ, లింగాల సుజాత, యాతం మహేశ్వరిలున్నారు. ఇందులో కొందరికి చేతులు, కాళ్లు విరగగా, కొందరికి తలకు తీవ్రగాయాలయ్యాయి.
మానవత్వం చాటుకున్న ఎంఎల్ఎ శంకర్నాయక్
కేసముద్రం నుండి ఇనుగుర్తి వెళ్లే సమయంలో వాహనం బోల్తా పడి ఉండటం చూసిన ఎంఎల్ఎ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎంఎల్ఎ శంకర్నాయక్ తానే స్వయంగా అంబులెన్స్ను తెప్పించి క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్ద్వారా తెలియజేశారు.
19 injured in wedding vehicle overturns in Kesamudram