జలాశయంలో నీళ్ళు నిండి ఏళ్లు గడుస్తున్న నేటికి ఆ జలాశయం కోసం సర్వం కోల్పోయిన ముంపు బాధితుల గోసలు తీరడం లేదు.. దీంతో దిక్కు తోచని స్థితిలో ముంపు బాధితులు బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటన కొండ పోచమ్మ సాగర్ జలాశయ ముంపు గ్రామం మామిడ్యా లో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొండ పోచమ్మ సాగర్ పునరావాస కాలనీ మామిడ్యా లో దాచారం అనీల్ (23) అనే యువకుడు గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా జలాశయం కోసం అనిల్ కుటుంబం 5 ఎకరాల ముప్పై గుంటల భూమిని కోల్పోయారని నేటికి ప్లాట్లు , ప్యాకేజీ అందక నిరాశతో ఈ బలవన్మరణానికి అనిల్ పాల్పడ్డాడని కుటుంబీకులు,ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదమమో లేక స్థానిక ప్రజాప్రతినిధుల చేతి వాటమో కానీ అసలైన లబ్ది దారులకు కాకుండా అనర్హులకు అన్ని ప్రభుత్వ హామీలు అందాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వం కోల్పోయిన తాము ప్రభుత్వ కార్యాలయాల చుట్టూత తిరిగి మా వయస్సు, చెప్పులు అరుగుతున్నాయి కానీ నేటికి మా గోసలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గత మూడు నెలల క్రితం అనిల్ తండ్రి మల్లయ్య తమ కుటుంబానికి ప్లాట్, ప్యాకేజీ రాలేదనే ఆవేదనతో గుండె పోటుతో మృతి చెందాడని వారన్నారు. అప్పటి నుండి ఇక అన్నితానై కుటుంబాన్ని సాకుతున్నాడు . అనిల్ మరణంతో ఈ కుటుంబం రోడ్డున పడిందని బంధువులు, గ్రామస్తులు అంటున్నారు. చూడాలి మరి ఇకనైన ప్రభుత్వం జలాశయం కోసం సర్వం కోల్పోయిన బాధితుల గోసలు పట్టించుకుని వారికి సహాయం చేస్తుందో లేక ఇలాగే ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తుందోనని.