న్యూఢిల్లీ : చైనా లోని వుహాన్ నగరం నుంచి 324 మంది భారతీయులు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 211 మంది విద్యార్థులు కాగా, 110 మంది పనిచేస్తున్న వివిధ రకాల ఉద్యోగులు. ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో వీరు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.37 గంటల ప్రాంతంలో మరో విమానం చైనాకు బయలు దేరింది. రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆస్పత్రికి చెందిన ఐదుగురు డాక్టర్లు మొదటి విమానంలో పర్యవేక్షించారు. చైనా నుంచి వచ్చే 300 మంది విద్యార్థుల కోసం ఢిల్లీకి సమీపాన మానేసర్లో ప్రత్యేక వైద్య కేంద్రాన్ని భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇదే విధంగా సరిహద్దు రక్షక బృందం ఐటిబిపి వాయువ్య ఢిల్లీ లోని చావ్లా ఏరియాలో ప్రత్యేక వైద్య కేంద్రంలో 600 పడకలను ఏర్పాటు చేసింది. రెండు వారాల పరిశీలనలో వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యబృందం తక్షణం తగిన చర్యలు తీసుకుంటుంది.