Thursday, May 2, 2024

అమెరికాలో చదువులు.. 35శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

అమెరికాలో చదువులు..
35 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు
ఈ విద్యా సంవత్సరం 12 శాతం వృద్ధి
చైనా తర్వాత రెండో స్థానం భారత్‌దే
53 శాతం విద్యార్థులు ఈ రెండు దేశాల వారే
అమెరికా విదేశాంగ శాఖ, ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: విదేశాల్లో పై చదువులు అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అమెరికా, బ్రిటన్‌లే.అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల తాకిడి పెరుగుతోంది.తాజాగా అది కరోనా మహమ్మారి మునుపటి స్థితికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓపెన్ డోర్స్ అనే స్వచంద సంస్థ గణాంకాల ప్రకారం 2022-23 విద్యాసంవత్సరానికి అమెరికా యూనివర్శిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12 శాతం పెరిగింది.

గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో విద్యార్థులు పెరగడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ ఏడాది విదేశీ విద్యార్థుల్లో భారత్‌నుంచి వచ్చిన వారి సంఖ్య 35 శాతం పెరగడం గమనార్హం. అమెరికా యూనివర్శిటీల్లో నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనానుంచి దాదాపు 2.9 లక్షల మంది( 27 శాతం) ఉండగా.. రెండో స్థానంలో ఉన్న భారత్‌నుంచి 2,69,000 మంది(25శాతం) అమెరికాలో ఉన్నత చదువుల కోసం వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో నమోదు చేసుకున్నారు.

మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఈ రెండు దేశాలనుంచే దాదాపు 53 శాతం ఉంటున్నారు. భారత్‌నుంచి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండగా చైనానుంచి మాత్రం గత మూడేళ్లుగా తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో పై చదువులు చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పది లక్షలకు పైగా ఉండగా,అందులో 25 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని, వరసగా మూడో ఏడాది భారత్‌నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో ప్రయాణం చేశారని ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది. చైనా, భారత్‌ల తర్వాత దక్షిణ కొరియా,కెనడా, వియత్నాం,తైవాన్, నైజీరియా దేశాలున్నాయి.ఈ ఏడాది మాత్రం బంగ్లాదేశ్( 28 శాతం), కొలంబియా, ఘనా (32%), భారత్(35%), ఇటలీ, నేపాల్(28%),పాకిస్థాన్(16%), స్పెయిన్ దేశాలనుంచి అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో భారీ పెరుగుదల కనిపించింది.కాగా అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్.

టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంత కాలంగా ఈ ప్రోగ్రామ్‌లలో 21శాతం పెరుగుదల కనిపించగా, యుజిలలో ఒక శాతం పెరుగుదల కనిపించింది.గణితం, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజనీరింగ్, బిజినెస్ విభాగాలున్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానాలుగా ఉన్న ఇల్లినోయ్, మిషిగాన్, టెక్సాస్ సహా 24 రాష్ట్రాల్లో చైనాకన్నా భారతీయ విద్యార్థులే అధికంగా ఉండడం విశేషం. కొవిడ్‌కంటే ముందు( 2018లో) అమెరికాలో ఉన్నతవిద్య కోసం నమోదు చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య 2015 16నుంచి ఏటా దాదాపు 11లక్షలుగా ఉండేది. అయితే కొవిడ్ తర్వాత రెండేళ్ల పాటు ఈ సంఖ్య తగ్గింది. తాజాగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది 11లక్షలకు చేరువైంది.

ఇలా విదేశీ విద్యార్థులను గణనీయంగా ఆకర్షిస్తున్నప్పటికీ అమెరికా విశ్వవిద్యాలయాలు స్థానిక విద్యార్థులను రప్పించడంలోమాత్రం అష్టకష్టాలు పడుతున్నట్లు నివేదికలు చెబుతుండడం గమనార్హం. 2009 10నుంచి మొట్టమొదటిసారి అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో భారత్ చైనాను దాటేసిందని ఓపెన్‌డోర్స్ నివేదిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది భారతీయ గ్రాడ్యుయట్ విద్యార్థుల సంఖ్య63 శాతం పెరిగి 1,65,936కు చేరుకుందని, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 64వేల మంది విద్యార్థులు పెరగ్గా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య కూడా 16 శాతం మేర పెరిగింది. ఇలా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే అంతర్జాతీయ విద్యార్థులకు గత వందేళ్లుగా అమెరికానే గమ్యస్థానంగా ఉంటోందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిఇఓ అల్లాన్ ఇ గుడ్‌న్యూస్ పేర్కొన్నారు.

విద్య విషయంలో భారత్‌తో అమెరికా బలమైన బంధాన్ని కలిగి ఉందని, ఇది మరింత బలోపేతం అవుతోందని విదేశాంగశాఖ విద్య విభాగానికి చెందిన మారియిఎన్ అభిప్రాయపడ్డారు. కాగా ‘ఈ విజయానికి అమెరికాలో చదివే ప్రతి భారతీయ విద్యార్థి, వారి విజయానికి మద్దతు ఇచ్చే వారి కుటుంబాలను అభినందించాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో చదవాలనే నిర్ణయం, అందుకు అమెరికాను మీరు ఎంచుకోవడం మీరు, మీ కుటుంబం పెట్టే విలువైన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మీరు మన రెండు దేశాలను మరింత చేరువ చేయడమే కాకుండా మమ్మల్ని ఉజ్వలమైన భవిష్యత్తుకు తీసుకెళ్లున్నారు’ అని భారత్‌లో అమెరికారాయబారి ఎరిక్ గార్సెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News