ఖాట్మండు: నేపాల్లో విహార యాత్ర కోసం కేరళ నుంచి వచ్చిన ఎనిమిది మంది పర్యాటకులు ఒక హోటల్ గదిలో మంగళవారం ఉదయం మరణించారు. హోటల్ గదిలో అమర్చిన గ్యాసు హీటర్ నుంచి వెలువడిన విషవాయువు కారణంగానే ఈ కేరళ పర్యాటకులు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం కేరళలోని తిరువనంతపురానికి చెందిన 15 మంది పర్యాటకులు విహార యాత్ర నిమిత్తం నేపాల్ వచ్చారు. భారత్కు తిరిగి వెళ్లేందుకు పోఖారా నుంచి వారంతా బయల్దేరారు. మార్గం మధ్యలో మక్వాన్పూర్ జిల్లాలోని దామన్ వద్ద ఎవరెస్ట్ పనోరమా రిసార్ట్ హోటల్లో బసచేశారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఆ ప్రాంతంలో రాత్రి బాగా చలిగా ఉండడంతో వెచ్చగా ఉండేందుకు రూములో ఉన్న గ్యాసు హీటర్ను వారు ఆన్ చేశారు. మొత్తం నాలుగు గదులను వారు బుక్ చేసుకున్నప్పటికీ ఎనిమిది మంది ఒక గదిలో, ఇతరులు మరో గదిలో ఉన్నారని హోటల్ మేనేజర్ చెప్పాడు. ఉదయం చూసేసరికి వారంతా ఆ గదిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే వారిని హెలికాప్టర్లో ఖాట్మండులోని హెచ్ఎఎంఎస్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారంతా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతులలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు.