అమెరికా ప్రభుత్వం వెల్లడి
వాషింగ్టన్: ఇటీవల కొద్ది రోజులుగా అమెరికాలోని రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నెట్వర్క్లను లక్షంగా చేసుకున్న రష్యన్ హాక్యర్లు రెండు సర్వర్ల నుంచి డాటాను చౌర్యం చేశారని అమెరికా అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో హ్యాకర్ల కార్యకలాపాలు వోటును తారుమారు చేసే అవకాశంతోపాటు ఎన్నికల ఫలితాల ప్రామాణికతపై సందేహాలకు తావిచ్చే అవకాశాలు ఉన్నాయన్న భయాందోళనలు నెలకొన్నాయి.
రష్యా ప్రభుత్వ అండదండలతో చెలరేగిపోతున్న హ్యాకర్లు ఇటీవలి కాలంలో అమెరికాలోని రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల నెట్వర్కులపై గురిపెట్టి కొంతమేరకు విజయం సాధించాయని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. అయితే హ్యాకింగ్కు గురైన నెట్వర్క్లపై నిర్దిష్టమైన సమాచారం ఇవ్వనప్పటికీ ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉన్నదీ లేనిదీ తమకు కచ్ఛితంగా తెలియరాలేదని వారు చెప్పారు. సైబర్సెక్యురిటీ క్రైమ్లో డ్రాగన్ఫ్లై, ఎనర్జెటిక్ బియర్గా వ్యవహరించే ఈ హ్యాకింగ్ గ్రూపలు 2011 నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరప్లోని ఇంధన కంపెనీలు, పవర్ గ్రిడ్ ఆపరేటర్లు, రక్షణ, పౌరవిమానయాన కంపెనీలపై సైబర్ గూఢచర్యాన్ని ఇవి సాగిస్తున్నట్లు ఎఫ్బిఐ, సైబర్సెక్యూరిటీ ఏజెన్సీ భావిస్తున్నాయి.