కేంద్రానికి మమత హెచ్చరిక
న్యూఢిల్లీ /కోల్కతా : కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం తమపై ఎక్కుపెడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దాడికి దిగారు. బిజెపి దేశాన్ని అమ్మేసిన బాపతు అని, వారు తమ వైపు వేలెత్తి చూపితే ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తమ పార్టీ టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీలకు సమన్లు వెలువరించిన వెంటనే మమత తీవ్రంగా స్పందించారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈ ఎంపి దంపతులపై అభియోగాలు దాఖలు చేశారు.
సెప్టెంబర్ 1, 6వ తేదీలలో తమ ఎదుట హాజరుకావాలని వీరిరువురికి వేర్వేరుగా ఇడి సమన్లు వెలువరించింది. అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. బిజెపికి ధైర్యముంటే తమను రాజకీయంగా ఎదుర్కొవాలి తప్ప, ఈ విధంగా తమ పరిధిలోని కేంద్రీయ దర్యాప్తు సంస్థలను ఈ విధంగా తమ పార్టీపైకి ఉసికొల్పడం తగదని మమత హెచ్చరించారు. గుజరాత్ చరిత్ర ఏమిటనేది తమకు తెలుసునని, అక్కడి కేసులను దులిపితే వాటితో సంచులు నింపవచ్చునని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మీమీద ఉన్న ఏ ఒక్క అభియోగంతో అయినా దుమారం లేవనెత్తవచ్చునని, ఏ విధంగా పోరాడాలో తెలిసిన వారిమని మమత తెలిపారు.