జెనెటిక్ ఇంజినీరింగ్కు ఆధారాలు లేవు
అమెరికా నిఘా వర్గాల నివేదిక
వాషింగ్టన్: సార్స్కోవ్-2 వైరస్ను చైనా రూపొందించిన జీవాయుధం అనేందుకు ఆధారాలు లభించలేదని అమెరికా నిఘా వర్గం(ఐసి) తన నివేదికలో తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలతో వైరస్ పుట్టుకపై ఆ దేశ నిఘా వర్గం దర్యాప్తు జరిపింది. కోవ్2పై దర్యాప్తు నివేదికను నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్(ఎన్ఐసి) డైరెక్టర్ సిద్ధం చేశారు. శుక్రవారం ఆ నివేదికను వెల్లడించారు. కొవిడ్ మొదటి కేసులు చైనాలోని వుహాన్లో 2019 డిసెంబర్లో నమోదయ్యాయి. కాగా, కొవిడ్ వైరస్ మనుషులకు సోకడం 2019 నవంబర్కు ముందే కొద్ది సంఖ్యలో ప్రారంభమై ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. అయితే,వైరస్ పుట్టుక ఎక్కడ..? ఎలా..? అనే విషయంలో ఐసిలోని సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదని నివేదికలో ఉటంకించారు. సార్స్కోవ్2 వైరస్ను జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా రూపొందించారనేందుకు ఆధారాలు లేవని పలు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వెల్లడించాయని నివేదిక పేర్కొన్నది. రెండు ఏజెన్సీలు మాత్రమే సృష్టించారా..? లేదా..? అనే అంశాల్లో దేనికీ ఆధారాలు లేవని అనుమానాలను రేకెత్తించాయని నివేదికలో గుర్తు చేశారు. కొవిడ్19 మొదటి కేసుల గురించి చైనా వైద్యులకు ముందే సమాచారం ఉండకకపోవచ్చని కూడా ఐసి నివేదిక పేర్కొన్నది.
ఇప్పటివరకూ ఉన్న డేటా ఆధారంగా దర్యాప్తు సంస్థలు రెండు ఊహాగానాల మధ్య చీలిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. అందులో ఒకటి..వైరస్ సోకిన జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుంది. రెండోది..ల్యాబ్ ప్రయోగాల సందర్భంగా జరిగిన ఆకస్మిక సంఘటన వల్ల వైరస్ బయటకు రావడం లేదా వ్యాప్తి చెందడం. ఐసికి చెందిన నలుగురు సభ్యుల నివేదిక, ఎన్ఐసి దర్యాప్తు ప్రకారం జంతువుల ద్వారా మనుషులకు సోకి ఉంటుంది. 99 శాతంమేర సార్స్కోవ్2ను పోలిన వైరస్ మొదట జంతువులకు, ఆ తర్వాత మనుషులకు సోకి ఉంటుందనన్నది మెజార్టీ అభిప్రాయం. ఐసికి చెందిన ఒకే ఒకరు ఈ సూత్రీకరణతో విభేదించారు. వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్లో ప్రయోగాల సందర్భంగా జంతువుల నుంచి శాంపిళ్ల సేకరణ, తదితర సందర్భాల్లో జరిగిన తప్పిదాల వల్ల వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందన్నది ఒకే ఒక్కరి అభిప్రాయం.