Wednesday, May 29, 2024

గుజరాత్ టీమ్ ను డకౌట్ చేద్దాం

- Advertisement -
- Advertisement -

విభజన హామీలపై సమాధానం చెప్పాకే మోడీ వరంగల్‌లో అడుగు పెట్టాలి
కారు షెడ్డుకు పోయినా.. కెసిఆర్ వంకర మాటలు ఆగలేదు 
ఎర్రబెల్లి, ఆరూరి తులసి వనంలో గంజాయి మొక్కలు
హన్మకొండ కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/ వరంగల్ బ్యూరో: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ అని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్ యుద్ధంలో గుజరాత్ టీమ్‌ను ఓడించాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని చౌరస్తా కార్నర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాకతీయ గడ్డ పౌరుషానికి నిలయమైతే ఈ గడ్డ నుండి ఆణిముత్యాలుగా ఎదిగిన వ్యక్తులు మహోన్నతంగా ఎదిగారన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డ ఇది అని అన్నారు. తెలంగాణ ఉద్యమా న్ని అందించి కాకతీయ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం అన్నారు.

ఇలాంటి గడ్డపై తులసివనంలో గంజాయి మొక్కలాగా ఎర్రబెల్లి ద యాకర్ రావు, అనకొండ లాంటి ఆరూరి ర మేష్ ఉండడం దురదృష్టకరమన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కనపడ్డదే కబ్జాగా వారు చేసిన ఆకృత్యాలకు ప్రజలు విసిగివేసారి మొ న్న జరిగిన ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో అసెం బ్లీ ఎన్నికల్లో కూడా ఒకటైన బిఆర్‌ఎస్, బిజె పి ఇప్పుడు ఎంపి ఎన్నికల్లో కలిసి తమ పార్టీ నిఓడించేందుకు కుట్రపన్నుతున్నాయని మండిపడ్డారు. బిజెపిలో నిలబడ్డ వ్యక్తులు బిఆర్‌ఎస్ నుండి పంపినవారేనని, వారిని గెలిపించడం కోసం బిఆర్‌ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి నేరుగా బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు కుట్రలకు తెరలేపాయన్నారు.

ఈ రెండు పార్టీల వ్యవహార శైలిని ప్రజలు, కార్యకర్తలు గమనించాలని అన్నారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేయడానికి వర్షం, పెనుగాలులు, పిడుగులు పడినా వరంగల్ గడ్డకు రాత్రి వేళ తాను వచ్చానంటే జరిగే విషయాలు అందరితో పంచుకోవడానికేనని అన్నారు. ‘మీ శ్రమ, రెక్కల కష్టాన్ని రాజకీయం చేస్తున్న కెసిఆర్ అసలు రూపాన్ని వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. రాత్రి, పగలు కష్టపడి పార్టీని నిర్మించుకుంటే ఆ పార్టీని బిజెపికి తాకట్టు పెట్టారన్నారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ ప్రజలు బిఆర్‌ఎస్, బిజెపికి కర్రు కాల్చి వాతపెట్టినప్పటికీ వారికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కారు రిపేరు కెళ్లిందని, షెడ్డుకుపోయిన కారు తిరిగిరాదని, కెసిఆర్ బస్సులో యాత్ర చేస్తున్నా, కొంత మారిండని అనుకున్నప్పటికీ అదే వంకర బుద్ధులు.. అవేవంకర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రధానమంత్రి మోడీ వరంగల్ గడ్డకు వచ్చే ముందు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. విభజన హామీలను అంశాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించలేదని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని లాతూర్‌కి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు ఇస్తానన్న ఐఐటి 10 ఏళ్ళైనా ఎందుకివ్వలేదని అన్నారు. ములుగులో ఇస్తానన్న గిరిజన యూనివర్సిటీ పనులు ఎన్నికల ముందు మొదలు పెట్టారని అన్నారు. వీటికి సమాధానం చెప్పాకే వరంగల్‌లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పరిపాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ కు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. వరంగల్‌కు రావాల్సిన స్మార్ట్ సిటీ నిధులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు.

నగరంలో అండర్ డ్రైనేజీ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం రింగ్ రోడ్డు, వేయి స్తంభాల గుడి చరిత్రకు తగిన అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాకతీయులు పరిపాలించిన గడ్డ వరంగల్ అని, వారి పాలనలో వరంగల్ రాజధానిగా వెలుగొందితే మోడీ, కెసిఆర్ పాలనలో వరంగల్ ధ్వంసానికి గురైందని అన్నారు. చరిత్రకు తగిన విధంగా రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ‘వరంగల్ గడ్డ నుండి అడుగుతున్నా.. గుజరాత్ మోడల్ అంటున్న నరేంద్ర మోడీ వరంగల్ గడ్డ నుండి మా సవాల్‌ను స్వీకరించాలి’ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌ని ఓడించాలన్నారు. గుజరాత్ టీం పక్కన మోడీ, అమిత్ షా ఉంటే.. తెలంగాణ టీం నుండి రాహుల్ గాంధీతో తాను ఉంటానని అన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టీంను డకౌట్ చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఫైనల్ యుద్ధంలో తాను సిద్ధమేనని, మీరు సిద్ధమేనా అని ప్రజలను అడిగారు. దానికి వచ్చిన జనం సిద్ధమని చేతులు పైకి ఎత్తి పిడికిలి బిగించారు. వరంగల్ ఎంపి అభ్యర్థి కడియం కావ్యను లక్ష మెజారిటీతో గెలిపించాలని సిఎం పదేపదే లక్ష అంటూ జనంతో పలికించారు.

వరంగల్‌కు వరాలు..
కాకతీయులు ఏలిన వరంగల్‌ను రెండో రాజధానిగా చేపట్టాల్సిన అభివృద్ధిని చేస్తానని సిఎం రెవంత్‌రెడ్డి అన్నారు. ఓఆర్‌ఆర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కావలసిన ప్రణాళిక, ప్రతిపాదనలతో అధికారులు హైదరాబాద్ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంఎల్‌ఎలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపి అభ్యర్థి కడియం కావ్య మాట్లాడారు. కాగా, ఉరుములు, మెరుపులు, భారీ వర్షంలో సైతం జనం భారీగా తరలి రావడంతో హన్మకొండ, వరంగల్ పోచమ్మ మైదానం వరకు సిఎం రోడ్ షో సక్సెస్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News