శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam terror attack) కేసులో టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంఘటన తెలిసిందే. అయితే, ఈ దాడి చేసిన ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కార్యకర్తను బుధవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని వివరంగా విశ్లేషించిన తర్వాత.. ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో అతని పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా గుర్తించారు. అతను సీజనల్ టీచర్గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. కటారియా సహచరులను గుర్తించేందుకు, విస్తృత ఎల్ఇటి (TRF) నెట్వర్క్ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.