ముంబై: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై విద్యార్థులలో అవగాహన కల్పించడానికి పాఠశాలల్లో ప్రచారం చేయాలన్న బిజెపి ప్రయత్నాన్ని మహారాష్ట్ర పర్యావరణ, పర్యాటక, ప్రొటోకాల్ శాఖ మంత్రి ఆదిత్య థాకరే తీవ్రంగా వ్యతిరేకించారు. ముంబైలోని మాతుంగలోని పాఠశాలలను బిజెపి నాయకులు సందర్శించి అక్కడ విద్యార్థులకు సిఎఎపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలియచేశారు. అంతేగాక సిఎఎ గురించి వారిని చైతన్యపరిచారు. దీనిపై ఆదిత్య థాకరే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పాఠశాలల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని హెచ్చరించారు. దీన్ని తాము ఎంత మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల విద్యాభ్యున్నతికి ఉపయోగపడే పనులు చేయాలని ఆయన బిజెపితో పాటు ఇతర రాజకీయ పార్టీలకు సూచించారు. ఒక చట్టం గురించి స్కూళ్లలో ప్రచారం చేయడం హాస్యాస్పదం. అలాంటి రాజకీయ ప్రచారాన్ని చేయడం ఏ విధంగా సమర్థనీయం. స్కూళ్లలో మాట్లాడాలని రాజకీయ నేతలు భావిస్తే లింగ సమానత, హెల్మెట్లు, పరిశుభ్రత గురించి మాట్లాడాలి అని పేర్కొన్నారు.