వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ హన్మకొండలోని రాంనగర్ లో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను తెలిపారు. షాహిద్ అనే యువకుడు తనకు దక్కట్లేదనే అక్కసుతో యువతిని చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్కు వచ్చాడు. అతడిని అరెస్టు చేశామని, ఈ రోజు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. యువతికి షాహిద్తో 2016లో పరిచయం ఏర్పడిందని, నిందితుడు అద్దెకు ఉన్న గదిలోనే యువతిని చంపాడని చెప్పారు.
ఇళ్లు అద్దెకు ఇచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, ఇండ్లు కిరాయికి ఇచ్చే ముందు కిరాయిదారుల గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. ఎవరిపైన అయినా అనుమానం వస్తే హాక్ఐలో కిరాయిదారులు ఇచ్చిన గుర్తింపు కార్డు అప్లోడ్ చేస్తే పోలీస్ పరంగా వారికి ఏమైనా నేర చరిత్ర ఉంటే విచారణ చేపడతామని వెల్లడించారు. కోచింగ్ తీసుకుంటున్నానని షాహిద్ గదిని అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. బయటి జిల్లాల నుంచి చాలా మంది యువకులు ఉద్యోగాలు, చదువుల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇళ్లు కిరాయికి ఇవ్వడం తప్పు కాదని, కాని ఇంటిని అద్దెకు ఇచ్చాం కదా, మనకు కిరాయి వస్తుంది కదా అని యజమానులు ఏమరపాటుగా ఉండకూడదని తెలిపారు.