Monday, April 29, 2024

దివ్యాంగులకు సకల సౌకర్యాలు: కలెక్టర్ అనుదీప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో:  పోలింగ్‌కు సంబంధించి దివ్యాంగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల ఉప అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 22 వేల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, ఈ నెల 30న ప్రతి ఒక్కరూ (100 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్ లో పి.డబ్ల్యూ.డిఅసోసియేషన్ ప్రతినిధులకు ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డి.ఇ.ఓ మాట్లాడుతూ… హైదరాబాద్ జిల్లాలో 4,119 పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. 15 నియోజకవర్గాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా థిమాటిక్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వికలాంగుల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్ లు, వీల్ ఛైర్ లనుఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు దివ్యాంగులకు ట్రాన్స్ పోర్ట్ నోడల్ ఆఫీసర్ ద్వారా వాహన సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సాక్ష్యం యాప్ ద్వారా వాహన సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపారు.

దివ్యాంగుల అసోసియేషన్లు ఈ సమాచారాన్ని తమ పరిధిలోని దివ్యాంగులకు తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. దివ్యాంగులకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లనుపంపిణీ చేశామని తెలిపారు.మూగ, చెవిటి వారికి సైన్ లాంగ్వేజ్ ద్వారా ఓటు హక్కు వినియోగం పై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామనితెలిపారు. అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి లో బ్యాలెట్ పేపర్ ను ముద్రిస్తున్నామని వెల్లండించారు. పోలింగ్ రోజు దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్స్ కు సహాయం చేయడానికి ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ ల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులతో పాటు 80 ఏళ్లు దాటిన వారికి హోం ఓటింగ్ ద్వారా వారి ఇంటికే వెళ్లి ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు చంద్రకాంత్ రెడ్డి,శ్రీవాత్స కోట, పి.డి సౌజన్య, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పద్మజ, జాయింట్ కమిషనర్ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News