Sunday, April 28, 2024

ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్ : మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్‌సాన్ సూకీకి సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష తగ్గనుందని ఆ దేశ అధికార ప్రతినిధి జా మిన్ తెలిపారు. గత వారం సూకీని జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించారు. మయన్మార్‌లో దేశ వ్యాప్తంగా జరుపుకొనే బౌద్ధ పండగ సందర్భంగా సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మైంట్ సహా ఏడు వేల మంది ఖైదీలకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా విన్‌మైంట్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష తగ్గనుంది.

ఆంగ్‌సాన్ సూకీని 19 కి పైగా కేసుల్లో దోషిగా తేలుస్తూ మయన్మార్ కోర్టు ఆమెకు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా క్షమాభిక్షలో భాగంగా వీటిలో నాలుగు కేసుల్ని రద్దు చేశారు. 1989 లో తొలిసారిగా సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు . 1991లో ప్రజాస్వామ్య స్థాపనకు కృషి చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి వచ్చింది. 2010లో ఆమెకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. 2015, 2020లో ఆమె పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధించినప్పటికీ 2021లో సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం బాధ్యతలు చేపట్టింది. మరోవైపు మయన్మార్‌లో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్టు సైనిక ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఎన్నికలను జాప్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News