Monday, April 29, 2024

మయన్మార్‌లో సైనిక వైమానిక దాడి.. వందమంది వరకూ మృతి

- Advertisement -
- Advertisement -

మయన్మార్‌లో సైనిక వైమానిక దాడి
వందమంది వరకూ మృతి
మృతులలో 20 మంది పిల్లలు?
తిరుగుబాటుదార్ల సమ్మేళనంపై చర్య
తప్పేమీ లేదన్న జుంటా వర్గాలు
నెప్యీడా : మయన్మార్‌లో సైనిక జుంటా నరమేధానికి దిగింది. సాగింగ్ గ్రామంలో ఓ ఉత్సవంపై వైమానిక దాడులకు దిగింది. ఈ క్రమంలో దాదాపు వంద మంది వరకూ దుర్మరణం చెందారు. తాము జరిపిన దాడిని మయన్మార్ సైన్యం సమర్ధించుకుంది. మంగళవారం వాయవ్య మయన్మార్‌లో ఓ కుగ్రామంలో తిరుగుబాటుదార్ల ఆధ్వర్యంలో ఓ ఉత్సవం జరుగుతుందని తెలియడంతో సైనిక పాలకులు ఉన్నట్లుండి విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో సైనిక పాలకులకు ప్రత్యర్థులు అయిన తిరుగుబాటుదార్లతో పాటు కొందరు పౌరులు కూడా చనిపోయి ఉంటారని బుధవారం మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. ఇటువంటి సమ్మేళనాలు ఉగ్రవాదులకు ఊతం అందించేలా ఉన్నాయని, అందుకే ఈ సభను విచ్ఛిన్నం చేసేందుకు ఈ విధంగా సైనిక చర్యకు దిగాల్సి వచ్చిందని, ఇందులో తప్పేమీ లేదని కూడా ప్రకటించారు. శాంతి సుసిర్థతల పునరుద్ధరణకు ఇటువంటి తీవ్రస్థాయి ఆపరేషన్ అత్యవసరం అని కూడా తెలిపారు.

దాడి ఘటనలో వంద మంది వరకూ మృతి చెందారు. ఇందులో పలువురు పిల్లలు కూడా ఉన్నారు. తిరుగుబాటుదార్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని దాడికి దిగారు.మయన్మార్‌లో 2021 నుంచి సంక్షోభ పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. అంతకు ముందు ఇక్కడ అధికారంలో ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ఆధ్వర్యపు పౌర ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు జరిపి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దీనితో అక్కడ తాత్కాలికంగా పాలనాపరంగా చేపట్టిన పలు సంస్కరణలు మూలకు పడ్డాయి. సైన్యం పరిపాలనా బాధ్యతలు తీసుకుంది. సూకీ చాలా ఏళ్లుగా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మయన్మార్‌లో సైనిక పాలనను వ్యతిరేకించే కొన్ని శక్తులు ఆయుధాలు సంతరించుకుని స్థానిక తెగలైన మైనార్టీ వర్గాలో కలిసి పోరు సల్పుతున్నాయి. దాడి ఘటనను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు.

ఈ నరమేధానికి బాధ్యులు ఎవరైనా వారిని తగు విధంగా శిక్షించాల్సి ఉందని ఆయన చెప్పినట్లు ఐరాస ప్రతినిధి ఒక్కరు తెలిపారు. దాడిని సమర్థిస్తూ మయన్మార్ సైనిక అధికార ప్రతినిధి జా మిన్ టున్ సైనిక ఛానల్ ద్వారా ప్రకటన వెలువరించారు. శాంతి భద్రతలు, సుస్థిరతకు పలు తీవ్రస్థాయి చర్యలు తప్పవని ఇందుకే తమ ఆధ్వర్యపు నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (ఎన్‌యుజి) ఈ దాడికి దిగిందని తెలిపారు. ఎన్‌యుజి ఇక్కడ నామమాత్రపు అధికారంలో ఉన్నప్పటికీ సైనిక అధికారులదే పైచేయిగా ఉంది. కొందరు సైనికులు కూడా మృతి చెందారని , ప్రజలకు వ్యతిరేకంగా సంఘటితం అవుతోన్న శక్తులను ఏరిపారేసేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. సైన్యం దాడి జరిపిన ప్రాంతంలో మానవ శరీరాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తాము ఈ ప్రాంతంలోని ఆయుధ గిడ్డంగిపై దాడి జరిపినట్లు అయితే అవి పేలి కొందరు మృతి చెంది ఉంటారని సైనిక ప్రతినిధి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News