Friday, April 26, 2024

వచ్చే నెల మరో 12 చీతాలు రాక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు భారత్‌కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చీతాల కోసం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య గత వారం ఒప్పందం జరిగినట్లు ఆ అధికారి చెప్పారు. ఏడు మగ, అయిదు ఆడ చీతాలను వచ్చే నెల 15 నాటికి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.‘ ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నాయి. ఈ నెలలోనే ఇవి భారత్‌కు చేరుకోవలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది’ అని ఆ అధికారి చెప్పారు. అటు దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.రానున్న పదేళ్లలో ఏటా 12 చొప్పున భారత్‌కు చీతాలను అందించేందుకు అవగాహనా ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

తొలి బ్యాచ్‌లో భాగంగా 12 చీతాలను ఫిబ్రవరిలో పంపించనున్నట్లు పేర్కొంది.1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్( ప్రస్తుత చత్తీస్‌గఢ్ రాష్ట్రం)లోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగై పోయాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని తిరిగి ప్రవేశ పెట్టేందుకు ‘ ప్రాజెక్టు చీతా’ ను ప్రాంభించింది. దీనిలో భాగంగా నమీబియానుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్కుకు తరలించారు. గత ఏడాది సెప్టెంబర్ 17న తన పుట్టిన రోజున ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వీటిని పార్కులో విడిచిపెట్టారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన చీతాలు తొలి వేటను కూడా చేసినట్లు ఆ మధ్య అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News