Sunday, June 16, 2024

ఎపిలో ఓట్ల లెక్కింపుపై సిఇఒ ముఖేష్ మీనా సమీక్ష

- Advertisement -
- Advertisement -

ఎపిలో వచ్చే నెల 4న జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరగా ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా చేసుకోవాలని సూచించారు. ఎపి సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు తప్ప అందరి సమష్ఠి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని అన్నారు.

ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అంటే ఏ రోజున, ఎన్ని గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజంట్లకు ముందుగానే తెలియజేయాలన్నా రు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డ్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజక వర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తదుపరే ఇవిఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు.

అదే విధంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్‌ను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‌లో ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్‌కు ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇవిఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సిసి కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు.

భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు సిఇఒలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News