న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నెలరోజుల ముందు ర్యాలీని నిర్వహించి ఇక్కడే ఆజాద్ అరెస్టు అయ్యారు. గురువారం రాత్రి బెయిల్పై విడుదలైన 33 ఏళ్ల ఆజాద్ కోర్టు ఆదేశాల మేరకు నగరం విడిచి వెళ్లడానికి ముందు ఉదయం 9 గంటల ప్రాంతంలో తన మద్దతుదారులతో కలసి పాత ఢిల్లీలోని జామా మసీదు మెట్లపైన కూర్చున్నారు. అక్కడే ఆయన రాజ్యాంగంలోని పీఠికను చదివారు. శాంతియుత నిరసనే తమ బలమని, ఈ నిరసనలు కేవలం ముస్లిములు మాత్రమే చేయడం లేదని ప్రభుత్వానికి తెలియచేసేందుకు తమను సమర్థించే అన్ని మతాల ప్రజలు పెద్దసంఖ్యలో తమతో చేతులు కలపాలని ఆజాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆజాద్కు బెయిల్ ఇచ్చిన తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి వైద్య చికిత్స కోసం తప్ప మరే ఇతర పనుల మీద నాలుగు వారాల పాటు ఆజాద్ ఢిల్లీకి రాకూడదని ఆదేశించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా హింస, జోక్యాన్ని నివారించడానికే ఆజాద్ను ఢిల్లీలోకి రానివ్వడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆజాద్ తన స్వస్థలం యుపిలోని సహరన్పూర్లో ఈ నాలుగు వారాలు నివసించాల్సి ఉంటుంది. ప్రతి వారం అక్కడి పోలీసు స్టేషన్లో సంతకం చేయవలసి ఉంటుంది.