న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాత ఢిల్లీలోని దరియాగంజ్లో జరిగిన హింసాకాండకు సంబంధించి అరెస్టయి తీహార్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యంపై వైద్యడొకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాద్ను వెంటనే చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు తరలించాలని, లేనిపక్షంలో ఆయనకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ వైద్యుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. గడచిన ఏడాది కాలంగా ఆజాద్ ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారని, ఆయనకు వారానికి రెండుసార్లు ఫ్లెబోటమి చేయించాల్సి ఉంటుందని డాక్టర్ హరిజిత్ సింగ్ భట్టి ట్వీట్ చేశారు. వెనిపంక్చర్ అని కూడా పిలిచే ఫ్లెబోటమి అంటే రక్తనాళాల నుంచి రక్తాన్ని సేకరించి ఆ రక్త నమూనాను అధ్యయనానికి పంపించడం. రక్తంలోని లోపాలను గుర్తించడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆజాద్కు ఏర్పడిన వ్యాధికి ఈ వైద్య పరీక్షలు ఎయిమ్స్లోని హెమటాలజీ విభాగంలో గత ఏడాది కాలంగా వారానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్నారని డాక్టర్ భట్టి తెలిపారు. ఈ పరీక్షలు చేయకపోతే ఆజాద్ రక్తం చిక్కబడి హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆజాద్ తీహార్ జైలు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వారు ఆయనను ఎయిమ్స్కు తరలించడం లేదని డాక్టర్ భట్టి తెలిపారు. జైలులో ఉన్న ఖైదీకి వైద్య సహాయాన్ని అందచేయకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన అన్నారు.
Bhim army chief was denied of medical care