లక్నో: పోలీస్ స్టేషన్ లో బిజెపి ఎంఎల్ఎ తన అనుచరులతో కలిసి కానిస్టేబుల్పై దాడి చేసి అనంతరం అతడితో మూత్రం తాగించాలని ఆదేశించిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బర్ఖేరా నియోజకవర్గం పరిధిలో చోటుచేసుకుంది. దీంతో బిజెపి ఎంఎల్ఎతో పాటు 30 మంది అతడి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపారు. మోహిత్ గుర్జార్ అనే కానిస్టేబుల్ రాహుల్ వద్ద 50 వేల రూపాయలకు బైక్ తీసుకున్నాడు. బైక్ను తన పేరు మీద మార్చుకోవడానిక డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకెళ్లాడు. ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలడంతో రాహుల్కు సదరు కానిస్టేబుల్ ఫోన్ చేసి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పిలిభిత్ మండి సమితి గేట్ వద్దకు వస్తే మాట్లాడుకుందామని కానిస్టేబుల్కు రాహుల్ సూచించాడు. రాహుల్ స్థానిక బిజెపి ఎంఎల్ఎ కిషన్ లాల్ రాజ్పూట్ అన్న కుమారుడు రిషబ్, ఎంఎల్ఎ అనుచరులు 10 మంది కలిసి గేట్ వద్ద వేచి చూస్తున్నారు.
కానిస్టేబుల్ రాగానే రాహుల్ బండబూతులు తిడుతూ దాడి చేయడమే కాకుండా అతడి వద్ద ఉన్న బంగారం, వాలెట్ ను లాక్కున్నారు. కానిస్టేబుల్ ఫైరింగ్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని అస్సాం రోడ్డులోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎంఎల్ఎ కిషన్ లాల్ తన అనుచరులు 35 మందితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకొని కానిస్టేబుల్ ను ఎంఎల్ఎ తన బూటుతో పలుమార్లు కొట్టాడు. కానిస్టేబుల్కు మూత్రం తాగించండని అనుచరులను ఆదేశించారు. దీంతో కానిస్టేబుల్ సంగారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండ కానిస్టేబుల్ను బయటకు పంపించారు. వెంటనే కానిస్టేబుల్ కోర్టును ఆశ్రయించడంతో ఎంఎల్ఎతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసింది.