వచ్చే బడ్జెట్లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం
వివాదాలు పరిష్కారం.. ప్రభుత్వానికి రాబడి ఉంటాయని అంచనా
న్యూఢిల్లీ: పన్నులకు సంబంధించి ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఒక వివాదాల పరిష్కార పథకాన్ని రాబోయే బడ్జెట్లో ప్రవేశ పెట్టే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ విషయం గురించి బాగా తెలిసిన నిపుణులు అంటున్నారు. రెవిన్యూ విభాగం డిమాండ్ చేసిన మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించి తమ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు ఈ పథకం ద్వారా వీలు లభిస్తుందని వారంటున్నారు. దీనివల్ల ప్రభుతానికి ద్రవ్య లోటు అంతరాన్ని తగ్గించుకోవడానికి వీలు కలగడమే కాకుండా ఈ వివాదాల్లో చిక్కుకు పోయిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తం అందుబాటులోకి వస్తుంది.
దేశవ్యాప్తరంగా న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు లాంటి వాటిలో దాదాపు 5 లక్షల కేసులు ఏళ్ల తరబడి నలుగుతున్నాయి. ఈ కేసుల్లో చిక్కుకు పోయిన మొత్తం7 8 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంటుందని ఓ అంచనా. ఈ కేసుల పరిష్కారానికి వివాదాల పరిష్కార పథకాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ గత ఏడాది జులైలో సిఫార్సు చేసింది. మరో వైపు పెండింగ్లో ఉన్న పన్ను వివాదాల కేసుల భారాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను సూచించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఒక కమిటీని గత ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది.
అయితే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ పథకానికి సంబంధించి కచ్చినతమైన వివరాలయితే బైటికి వెల్లడి కాలేదు కానీ ఈ పథకం కూడా సబ్కా వికాస్ పథకం మాదిరిగానే ఉండవచ్చని తెలుస్తోంది. పరోక్ష పన్నుల విభాగంలో ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల దాకా రాబడి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
Budget may introduce tax dispute settlement scheme