ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అవుతుంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్ను వెలువరించింది. ఉగ్రవాదులు, నక్సల్స్ జరిపిన దాడిలలో గాయపడ్డ వారు, మృతి చెందిన వారికి, మత కల్లోలాలలో బాధితులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం అమలులో ఉంది. ఇక పౌరులు ఆయా సందర్భాలలో ఈ పథకం ద్వారా తగు సాయం పొందేందుకు ఆధార్ను గుర్తింపుగా చూపాల్సి ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. దీని మేరకు బాధిత పౌరులు, వారి కుటుంబ సభ్యులు , సరిహద్దులలో కాల్పుల్లో బాధితులు, మందుపాతరలు, ఐఇడి పేలుళ్ల బాధితులు భారతభూభాగంలో ఎటువంటి కష్ట నష్టాలకు గురి అయినా, సంబంధిత పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం పరిధిలో పొందేందుకు వీలుంది.
అయితే ఆధార్ను చూపడం కానీ, ఆధార్ గుర్తింపు ప్రక్రియకు పోతున్నట్లు కానీ తెలియచేసుకోవల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆధార్ లేని వారు, సంబంధిత ప్రక్రియకు వెళ్లని బాధితులు సాయం పొందేందుకు ఇకనైనా ఆధార్ పొందేందుకు తగు చర్యలకు దిగాల్సి ఉంటుంది. ఆధార్ ప్రక్రియ పూర్తిగా అమలులోకి రాని అసోం, మేఘలయా తప్ప మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారికి ఈ వర్తింపచేస్తూ తక్షణం ఈ నోటిఫికేషన్ అమలులోకి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్రాల పరిధిలో ఘటనలు జరిగితే తొలుత బాధితులకు రాష్ట్రాలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సాయం మొత్తాన్ని ఆయా రాష్ట్రాలకు కేంద్రం తమ పథకం పరిధిలో జమచేస్తుంది. ఈ పథకానికి వార్షిక కేటాయింపు దాదాపుగా రూ 6 కోట్ల నుంచి రూ 7 కోట్ల వరకూ ఉంటుంది. ఈ పథకం పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు పొందేందుకు అవసరమైన ఏర్పాట్లను పథకం నిర్వాహక సంస్థ వారు చేపట్టాల్సి ఉంటుంది.