లక్నో: నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గత శనివారం యుపిలోని లక్నోలో మాజీ ఐపిఎస్ అధికారి ఎస్ఆర్ దరాపురి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రయాణించిన ద్విచక్రవాహన యజమానికి ట్రాఫిక్ పోలీసులు రూ. 6,300 జరిమానా విధించారు. టూవీలర్లో వెనుకకూర్చున్న ప్రియాంక గాంధీతోపాటు వాహనం నడిపిన వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ జరిమానా విధించగా ఆ డబ్బు తానే కడతానంటూ ఆ వాహనం యజమాని రాజ్దీప్ సింగ్ ముందుకు వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనలలో పాల్గొన్నందుకు మాజీ ఐపిఎస్ అధికారి ఎస్ఆర్ దరాపురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ప్రియాంక గత శనివారం ఇక్కడకు వచ్చారు.
అయితే ప్రియాంక రాకను అడ్డుకున్న పోలీసులు ఆమె దరాపురి నివాసానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దీంతో తన కారును వదిలి ఆమె టూవీలర్పై దరాపురి ఇంటికి చేరుకున్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందంటే..రాజ్దీప్ సింగ్ టూవీలర్లో పని మీద వెళుతుండగా దారిలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ధీరజ్ గుర్జార్తో కలసి ప్రియాంక గాంధీ కనిపించారు. టూవీలర్ కావాలని ధీరజ్ కోరగా ప్రియాంకకు సాయం చేస్తున్నానన్న గర్వంతో అతను మారుమాట్లాడకుండా తన వాహనాన్ని వారికి ఇచ్చేశాడు. అయితే రూ. 6,300 చలానా విధించినట్లు రాజ్దీప్కు పత్రికల ద్వారా తెలిసింది. అయినప్పటికీ రాజ్దీప్ చింతించడం లేదు.
ఆ డబ్బు తాను ప్రియాంక నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో తీసుకోదలచలేదని, చలానాను తానే కట్టేస్తానని రాజ్దీప్ చెప్పాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల ఆధారంగా ప్రియాంక, మరో వ్యక్తి హెల్మెట్ లేకుండా టూవీలర్లో ప్రయాణించడం తమ దృష్టికి వచ్చిందని, ఎం పరివాహన్(వాహనాల వివరాలు తెలిపే మొబైల్ యాప్) ద్వారా ఆ టూవీలర్ రాజ్దీప్ సింగ్దని గుర్తించి జరిమానాకు సంబంధించిన చలాన్ జారీచేశామని ట్రాఫిక్ ఎస్పి పూర్ణేందు సింగ్ తెలిపారు.