హైదరాబాద్: తెలంగాణ భవన్లో మీడియాతో రాష్ట్ర మున్సిపల్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని మంత్రి కెటిఆర్ అన్నారు. 2019 తమకు బ్రహ్మండమైన ఆరంభం ఇచ్చిందని, 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో శుభారంభం చేస్తామని తెలిపారు. కొత్త దశకంలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారన్నారు. ఈ నెల మొదటివారంలో కెసిఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కౌన్సిలర్పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 2020-30 దశకం టిఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్టానిదేనన్నారు. ఈ ఏడాది తాను సిఎం అవుతానన్న చర్చే అవసరం లేదన్నారు. సిఎం కెసిఆర్ స్వయంగా అసెంబ్లీలోనే ఈ విషయం చెప్పారు. దానికి తిరుగులేదని కెటిఆర్ అన్నారు.