కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి
ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు
జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ
విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం
పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం : ప్రగతి భవన్ చర్చలలో ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ దృఢ సంకల్పం
ఆరుగంటల పాటు సాగిన భేటీ
తరచూ తగ్గిపోతున్న కృష్ణ ప్రవాహంపై సిఎంల ఆందోళన, చర్చల మధ్యలో సిఎస్లతో సంప్రదించిన ముఖ్యమంత్రులు
హైదరాబాద్ : ప్రజలకు ప్రయోజనం కలిగించే అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం వహించారు. కృష్ణా నది నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చా రు. విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్కు వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు.
పూర్తి సుహృద్భావ వాతావరణంలో, పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. గోదావరి నీటిని కృష్ణా రైతులకు అందించాలి “కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడా దీ ఒకే రకంగా ఉం డడం లేదు. తరచు ప్రవాహం తగ్గిపోతున్నది. దీంతో కృష్ణ నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగ ర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్గొండ వ్యవసా య భూములకు ఖచ్చితంగా నీరు అందుతుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి.
దీని వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు” అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణ యం కుదిరింది. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి..? ఎలా వినియోగించాలి..? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి..? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత సమగ్రంగా చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. “విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని పలు అంశాలపై అనవసర పంచాయతీ ఉంది.
దీన్ని త్వరంగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏదీ కాదు” అని ఇద్దరు సిఎంలు అభిప్రాయపడ్డారు. సమావేశం నుంచే ఇద్దరు సిఎంలు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. 9, 10వ షెడ్యూల్ లోని అంశాలను పరిష్కరించుకునే దిశలో త్వరలోనే సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఎపి సిఎం జగన్ వెంట ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు. జగన్కు స్వాగతం పలికిన వారిలో మంత్రి కెటిఆర్, ఎంపి జి.సంతోష్కుమార్లు ఉన్నారు.