వాషింగ్టన్: చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. తమ కూతురును భర్తే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పూతలపట్టు మండలానికి చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలతకు పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడితో 2016లో వివాహం జరిగింది. అనంతరం వీరిద్దరూ 2017లో అమెరికాకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీళ్లకు ఒక కూమారుడు ఉన్నాడు. మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకుందని త్యాగరాజులుకి సమాచారం తెలిసింది. దీంతో ఆవేదన చెందిన వారు అల్లుడిపైనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూతురు మృతదేహాన్ని ఇండియాకు పంపించాలని తాము కోరితే, అందుకు అల్లుడు అంగీకరించడం లేదని వారు తెలిపారు. ప్రేమలత మరణం వెనుక కుట్ర ఉందని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తాను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటానన్న కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Chittoor woman commits suicide in New Jersey